Tripura Elections | త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. 60 స్థానాలకు పోలింగ్ జరుగనుండగా.. 259 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 31 మంది మహిళా అభ్యర్థులు సైతం బరిలో ఉన్నారు. ఈ మేరకు ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కోసం 2,504 పోలింగ్ స్టేషన్లలో 3,327 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 31 మంది పోలీస్ సిబ్బందిని నియమించగా.. 28.14లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలకు భారీ భద్రత కల్పించింది.
అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్తో కూడిన దాదాపు 400 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF), సుమారు 9వేలమంది త్రిపుర స్టేట్ రైఫిల్స్ జవాన్స్, 6వేల మందికిపైగా త్రిపుర పోలీసు బలగాలను మోహరించారు. ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికలు పలువురు సీనియర్ల రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ముఖ్యమంత్రి మాణిక్ సాహాతో పాటు కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ సైతం ఎన్నికలో బరిలోకి దిగారు. ఉప ముఖ్యమంత్రితో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించనున్నారు.