సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): శిశు సంరక్షణలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం పలు రకాల ఆధునిక వైద్యసదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు మరో కీలక విభాగాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. వివిధ రకాల లోపాలతో జన్మించే శిశువులకు మెరుగైన వైద్యం అందించేందుకు నిలోఫర్ హాస్పిటల్లో డీఈఐసీ ప్రత్యేక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం ఇప్పటికే కొనసాగుతున్నది. అయితే, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలను విస్తరించే క్రమంలో అదనంగా మరో విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.
రూ. కోటితో నిర్మాణం..
కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డీఈఐసీ) నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ సెంటర్లో అన్నిరకాల స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా పుట్టుకతో లోపాలున్న శిశువులకు కూడా ఇక్కడ వైద్య పరీక్షలు చేయడంతో పాటు చికిత్స అందిస్తామని దవాఖాన వైద్యులు తెలిపారు. నిలోఫర్ పాత భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఆధునిక హంగులతో డీఈఐసీని నిర్మించారు.
ఈ లోపాలున్న శిశువులకు ప్రత్యేక చికిత్స..
బర్త్ డిఫెక్ట్: పుట్టుకతో లోపాలున్న శిశువులు అంటే గుండె, గ్రహణ మొర్రి వంటి సమస్యలతో జన్మించిన శిశువులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అవసరమైన చికిత్స అందిస్తారు.
డెఫిషియన్సీ: హార్మోన్స్, మెటాబాలిక్ డీ ఆర్డర్ తదితర లోపాలున్న శిశువులు
డిలే డెవలప్మెంట్: ఎదుగుదలలో లోపాలున్న శిశువులు, పుట్టుకతోనే చెవుడు, దృష్టిలోపం వంటి సమస్యలున్న శిశువులు
చికిత్సకు ప్రత్యేక వైద్య సిబ్బంది..
వివిధ రకాల లోపాలతో జన్మించే శిశువులకు వైద్య పరీక్షలు చేయడం, వైద్య సేవలు అందించేందకు 18 మంది ప్రత్యేక వైద్య సిబ్బందిని డీఈఐసీ విభాగానికి కేటాయించారు. ఇందులో చిన్నపిల్లల వైద్య నిపుణులు, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ సిబ్బందితో పాటు ఆడియోలాజి, చైల్డ్ సైకియాట్రిక్ తదితర వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని నిలోఫర్ వర్గాలు తెలిపాయి. ఈ సెంటర్ను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.