సిగ్నల్ ఫ్రీ రహదారులే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు
పూర్తయిన ఒవైసీ – మిధాని జంక్షన్ ఫ్లై ఓవర్ పనులు
రూ.63 కోట్ల వ్యయంతో నూతన టెక్నాలజీతో 1.36కి.మీ.లు
నగరం తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా నిర్మాణం
రేపు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
సిటీబ్యూరో, డిసెంబరు 26 :
నగరం తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా నిలువనున్న ఒవైసీ -మిధాని జంక్షన్ ఫ్లై ఓవర్ను మంగళవారం పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించనున్నారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీలతో కలిసి ఉదయం 10 గంటలకు మంత్రి కేటీఆర్ ఫ్లై ఓవర్ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సిగ్నల్ ఫ్రీ రహదారులే లక్ష్యంగా..
మిధాని ఒవైసీ జంక్షన్లో ట్రాఫిక్ను క్రమబద్దీకరిస్తూ రూ.63 కోట్ల వ్యయంతో 1.36 కిలోమీటర్ల మేర ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగింది. సిగ్నల్ఫ్రీ రహదారులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసుకొని అందుబాటులోకి వస్తున్నాయని జీహెచ్ఎంసీ సీఈ దేవానంద్ తెలిపారు. ఓవైసీ ఫ్లైఓవర్తో దక్షిణ ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతానికి వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని పేర్కొన్నారు.
రద్దీ తగ్గేలా..
ఒవైసీ -మిధాని జంక్షన్ ఫ్లై ఓవర్ వినియోగంలోకి రానుండటంతో మిధాని జంక్షన్ వైపు నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్లే వాహనదారులకు ఎంతో ఉపశమనం దొరుకుతుంది. మిధాని, ఒవైసీ జంక్షన్ల వద్ద ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. ప్రధానంగా డీఆర్డీఓ, డీఆర్డీఏ, ఏఎస్ఎల్ తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరాంఘర్ నుంచి ఎల్బీ నగర్ మార్గంలో ఇబ్బందులు ఉండవని అధికారులు
పేర్కొన్నారు.
దేశంలోనే తొలి సారిగా ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ
క్రాష్ బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్, శ్లాబ్ పానెల్స్ వంటి పనులకు ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వాడారు. దీంతో సమయం కలిసి రావడంతో పాటు మ్యాన్పవర్ తగ్గిందని, పని ప్రదేశంలో ప్రమాదాల రిస్క్ తగ్గిందని బీఎస్సీపీఎల్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. దేశంలో ఇలాంటి టెక్నాలజీని హైదరాబాద్లోనే తొలిసారి వినియోగించినట్లు ఎస్ఈ దత్తుపంత్ తెలిపారు.