నిజామాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్నదాతలకు దక్కాల్సిన లాభాలు రైస్మిల్లర్ల పాలవుతున్నాయి. సన్నరకం వడ్లు వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. మిల్లర్లు సిండికేట్గా మారి రైతులకు మద్దతు ధర దక్కకుండా నిలువు దోపిడీ చేస్తున్నారు. సన్నరకం పంట దిగుబడి తక్కువగా ఉండటం, దొడ్డుబియ్యం తినేవారి సంఖ్య తగ్గిపోవడంతో బహిరంగ విపణిలో సన్నబియ్యం ధర ఏటేటా పెరుగుతూనే ఉంది. ఎక్కువగా వానకాలంలో సాగు చేసే సన్నాలను ఈసారి యాసంగిలోనూ సాగుచేసి దిగుబడులు సాధించారు. కరెంట్ కష్టాలు, సాగునీటి ఇక్కట్లను దాటుకుని పండించిన పంటను విక్రయానికి తీసుకొచ్చే సరికి దోపిడీకి గురవుతున్నారు. అన్నదాతలు ఆరుగాలం శ్రమిస్తే వ్యాపారులు అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. కనీస మద్దతు ధరకు కొంటున్నట్టు చెప్తున్న కొంతమంది వ్యాపారులు సంచికి 3-5 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. పంట కోతకు వచ్చిన సమయంలో ధరలు పెరగడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. కానీ విపణిలోకి ధాన్యం రావడంతో ధర పడిపోవడం చర్చనీయాంశమైంది.
సన్నరకాలు సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో మిల్లర్లు, వ్యాపారుల చేతిలో కర్షకులు అడ్డంగా మోసపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి జైశ్రీరాం, హెచ్ఎంటీ, బీపీటీ ధాన్యం భారీగా వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి క్వింటా రూ.2,203, బీ గ్రేడ్ రకానికి క్వింటా రూ.2,183 గా ఉంది. అంతకంటే తక్కువ ధరకు వడ్లను సేకరిస్తే కేంద్ర చట్టాల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ క్షేత్ర స్థాయిలో తనిఖీలు, పరిశీలన అన్నదే లేకుండా పోయింది. బహిరంగ మార్కెట్లో ఎవరు కొంటున్నారు.. ఎంతకు కొంటున్నారో కూడా సర్కారు పట్టించుకోవడం లేదు. సర్కారు నిర్లక్ష్యం ప్రైవేటు వ్యాపారులకు మేలు చేస్తున్నది. పచ్చి ధాన్యం పేరుతో రూ.2 వేలలోపే సన్న వడ్లను వ్యాపారులు సేకరిస్తున్నారు.
సన్నరకం సాగుకు ఎక్కువ పెట్టుబడి, శ్రమ అవసరం. అలాగే, దిగుబడి తక్కువగా వస్తుండడంతో రైతులకు నష్టం కలుగుతుంది. ఈ ఏడాది అకాల వానలతో పంటలకు తెగుళ్లు సోకి మరింత దిగుబడులు తగ్గాయి. వ్యాపారుల మాయాజాలం వల్ల సన్న, దొడ్డు రకాలకు తేడా లేకుండా పోయింది. కేసీఆర్ హయాంలో సన్నాలను పండించిన రైతులకు ఒకానొక దశలో ప్రత్యేక ధరలతో లాభం చేకూర్చారు. ప్రైవేటు వారిని రంగంలోకి దించి అధిక ధరలతో సక్రమంగా కొనుగోళ్లు జరిగేలా చూశారు. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తారుమారయ్యాయి. దొడ్డు, సన్న రకాలకు ఒకే ధరను పెట్టి ప్రైవేటు వ్యాపారులు డబుల్ సంపాదనను ఆర్జిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పెద్దల అండతో తెలంగాణ వ్యాప్తంగా సన్నబియ్యం ధరలు అమాంతరం పెంచేశారు. జైశ్రీరాం క్వింటా ధర రూ.7,500లకు చేర్చారు. భారీ నిల్వలను పెట్టుకున్న బడా వ్యాపారులైతే రూ.కోట్లు ఆర్జించారు. నిజామాబాద్లో పేరొందిన మిల్లర్లు రంగంలోకి దిగి సన్న రకం ధాన్యానికి రూ.2వేల నుంచి రూ.2200లోపే కొంటున్నారు. మర ఆడించిన బియ్యాన్ని క్వింటాకు రూ.7500లకు రిటైల్గా అమ్మేస్తూ సామాన్యులపైనా ఎడతెగని భారాన్ని మోపుతున్నారు. ఈ దందాను నియంత్రించాల్సిన ప్రభుత్వం మాత్రం చేతులు ఎత్తేసి సినిమా చూస్తోందంటూ రైతులు మండిపడుతున్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంలో కీలక పదవిలో ఉన్న నిజామాబాద్కు చెందిన ఓ నాయకుడైతే కాంగ్రెస్ పెద్దలతో చేతులు కలిపి నిజామాబాద్ మిల్లర్లకు అండగా నిలుస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.