హుజూరాబాద్ : ఉప ఎన్నికల్లో పనులు చేసే టీఆర్ఎస్ వైపు ఉంటారో… ముచ్చట్లు చెప్పే బీజేపీ వైపు ఉంటారో తెల్చు కోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఉప ఎన్నిక ఎందుకోసం వచ్చిందో దేని కోసం వచ్చిందో తెలుసుకోవాలన్నారు. ఈటల రాజేందర్ దేనికోసం, ఎందుకోసం, ఎవరికోసం రాజీనామా చేశాడో చెప్పాలన్నారు.
గడిచిన ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన విధంగా దేశంలో మరే రాష్ట్ర అభివృద్ధి చెందలేదన్నారు. పక్క రాష్ట్రాల ప్రజలు తెలంగాణను చూసి గర్వపడుతున్నారని, మన రాష్ట్రంలో ఎందుకు పుట్టలేదని బాధపడుతున్నా రన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కన్నా ఏ ఒక్క రాష్ట్రమైన అభివృద్ధిలో ముందు ఉందా చెప్పాలన్నారు. రాష్ట్రం చుట్టు పక్కల ఉన్న కొన్ని ప్రాంతాలు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.
ఒకప్పుడు తెలంగాణలో ఎందుకు పుట్టినమా అనుకునే స్థితి నుంచి కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణలో పుట్టినందుకు గర్వ పడుతున్నామనే స్థితికి వచ్చామన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఒక జాతీయ ప్రాజెక్టు హోదా అయిన ఇచ్చిందా చెప్పాలన్నారు. దేశ వ్యాప్తంగా బీసీ గణన చేయాలని డిమాండ్ వస్తున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకున్నా పాపాన పోలేదన్నారు. బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేట్ పరం చేస్తూ రిజర్వేషన్లతో పాటు యువకుల ఉద్యోగుల అవకాశాలు కూడా కాలరాస్తున్నారని మండిపడ్డారు.
దేశ వ్యాప్తంగా ఓట్ల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికి ఎందుకు చేయడం లేదన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఇక్కడి ప్రజలకు ఏం చేస్తుందో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క కులం, వర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరి అభివృద్ధిని కాంక్షించే ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. రెండు సార్లు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కనీసం ఒక బీసీ భవనమైన కట్టించారా లేదా అతని కులస్తులకు ముదిరాజ్ భవనమైన కట్టించారా చెప్పాలన్నారు.
టీఆర్ఎస్ లో ఎదిగి ఆస్తులు, అంతస్తులు, హోదా సంపాదించుకున్నా ఈటల ఇప్పుడు అదే పార్టీ అధినేత కేసీఆర్పైన విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. రాజేందర్ హుజూరాబాద్లో ఏ ఒక్క బీసీ నాయకుడిని దగ్గరికి రానివ్వక పోగా పాటు ఎదగనివ్వలేదన్నారు. ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం ప్రతి కులానికి ఆత్మీయ భవనానికి స్థలంతో పాటు నిధులు సమకూర్చింది కేసీఆర్ అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.
హుజూరాబాద్ ప్రజలు చైతన్యవంతులు అని, ఏ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని వారికి తెలుసునన్నారు. ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ఎన్నో కేసులు ఎదుర్కొన్న పేదవాడు గెల్లు శ్రీనివాసును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న కేసీఆర్కు గెల్లు శ్రీనివాస్ను గెలిపించి కానుకగా ఇవ్వాలన్నారు. ఈటల తన సమస్యను ప్రజల సమస్యగా చిత్రికరించడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు రమాదేవి, తాళ్ళపెల్లి శ్రీనివాస్ గౌడ్, బొరగాల శివకుమార్, నాయకులు పల్లె లక్ష్మణ్ రావుగౌడ్, భూమగౌడ్, కొలిపాక శ్రీనివాస్, తాళ్ళపెల్లి రమేష్గౌడ్, లత తదితరులున్నారు. ఈ సందర్భంగా ఇప్పల్ నర్సింగాపూర్కు చెందిన గూడూరి మల్లారెడ్డి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. అతనికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.