తెలంగాణ ఆధ్యాత్మిక రాజధాని యాదాద్రి ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ఈ నెల 28 వరకు నిర్వహించే పంచకుండాత్మక మహా యాగానికి సోమవారం అంకురార్పణ జరుగనుంది. బాలాలయంలో ఉదయం 9 గంటలకు స్వస్తివాచనంతో పూజా కైంకర్యాలను ప్రారంభించనున్నారు. 108 మంది పారాయణీకులు, వేద పండితులతో ఉత్సవాలు వైభవోపేతంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగాబాలాలయాన్ని పూలు, విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 7 రోజులపాటు సాగే పంచ కుండాత్మక యాగానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు నారసింహుడి జన్మనక్షత్రం(స్వాతి) సందర్భంగా పంచ కుండాత్మక మహాయాగాన్ని ప్రారంభించనున్నారు. యాగం చివరి రోజున శ్రీమన్నారాయణుడి జన్మ నక్షత్రం (శ్రవణం) సందర్భంగా ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు స్వయంభువుల దర్శన భాగ్యం కల్పించనున్నారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్య ప్రధానాలయం స్వయంభువుల దర్శనానికి చేపట్టే మహాకుంభ సంప్రోక్షణకు నేడు అంకురార్పన జరుగనున్నది. నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఆలయ ప్రధానార్చక బృందంతో పాటు 108 మంది పారాయణీకులు, వేదపండితులు ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. స్వామివారి బాలాలయంలో ఉదయం 9 గంటలకు స్వస్తివాచనం ప్రారంభించి విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనం, రుత్విగ్వరణం, అఖండజ్యోతి ప్రజ్వలనతో పాటు వాస్తుపూజ, వాస్తుబలి, వాస్తు హోమాన్ని ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యుల బృందం చేపట్టనున్నది. సాయంత్రం 6 గంటల నుంచి మృత్సంగ్రహణం, అంకురార్పణం, యాగశాల ప్రవేశం, కుంభ స్థాపన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 7 రోజుల పాటు బాలాలయంలో సాగే పంచకుండాత్మక యాగానికి కావాల్సిన పనులను అధికారులు పూర్తి చేశారు.
బాలాలయంలో జరిగే పంచకుండాత్మక మహాయాగాన్ని సోమవారం ఉదయం 9 గంటలకు స్వస్తివాచనంతో ప్రారంభించనున్నారు. 28వ తేదీ వరకు శ్రీపాంచరాత్ర దివ్యగమోక్త ప్రకారం బాలాలయంలో సప్తాహ్నిక దీక్షాపూర్వకంగా పంచకుండాత్మక లక్ష్మీనారసింహ హవనసహిత కుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సకలం సిద్ధం చేశారు. కార్యక్రమానికి రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పారాయణీకులు, వేద పండితులు యాదాద్రికి చేరుకున్నారు. బాలాలయంలో యాగశాల, వేదిక నిర్మాణాలు పూర్తి చేశారు. నిత్యం స్వామి,అమ్మవార్లను యాగశాలలోని వేదికపై వేంచేపు చేసి చతుస్థానార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్వామివారి, లక్ష్మీ అమ్మవారి మూర్తికుంభం, చక్రభ్య మండల ఆరాధన, మూర్తికుంభ ఆరాధన, ఉత్సవమూర్తులకు నిత్య త్రికాలారాధన కార్యక్రమాలను చేపడుతారు.
బాలాలయంలో స్వామివారికి నిత్యపూజా కైంకర్యాల అనంతరం నవకలశాభిషేకం నిర్వహిస్తారు. స్వామివారిని సంసిద్ధ పరిచి యాగశాల ఆస్థానం చేయనున్నారు. మహాప్రతిష్ఠ నిర్విఘ్నంగా జరుగాలని విష్వక్సేన పూజ నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. విష్వక్సేనుడు స్వామివారి సేనా నాయకుడు. సకల నదీజలాలను సంసిద్ధ పరిచి, స్వామివారిని అంతరేంద్రియం, బాహ్యేంద్రియం శుద్ధి చేసేందుకు పుణ్యాహవాచనం చేపట్టి, స్వస్తివాచనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వర్గంలోని విరజా నదీ తీరాన్ని మహాకుంభంలోకి ఆవాహనం చేసి శాంతి మంత్రాలతో అభిమంత్రించి యాగశాలను, ఆలయాన్ని శుద్ధి కార్యక్రమాన్ని మంత్రపూర్వకంగా నిర్వహిస్తారు. ‘రక్ష్యా పిక్ష్యాః ఉపేక్షతే’ అనే విధంగా స్వామివారి దీక్షా కంకణాన్ని ధరింపజేస్తారు. ఆశుచి, అపవిత్రత కలుగకుండా, స్వామివారి శక్తి అనంతంగా ఇమిడేందుకు, స్వామివారి సేవా కైంకర్యాన్ని నిర్విఘ్నంగా జరిపేలా శరీరం సహకరించేందుకు శక్తి కోసం రక్షాబంధనం చేపడుతారు. మంత్ర పుష్పనీరాజనాలతో స్వస్తివాచన కార్యక్రమం పూర్తి చేస్తారు. రాష్ట్రంలో క్షేత్రాలన్నీ పునీతం కావడంతోపాటు పాడిపంటలతో రాష్ట్రం సస్యశ్యామలం కావాలని, ఆన్ని జీవరాశులకు ఆహారం అందాలనే సంకల్పంతో మృత్సంగ్రహణం, అంకురారోపణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
పంచకుండాత్మక మహాయాగానికి బాలాలయం ముస్తాబైంది. ప్రధాన యాగశాల నిర్మాణాన్ని అధికారులు సిద్ధం చేశారు. చతురస్రం, వృత్తం, అర్ధవృత్తం, పద్మం, త్రికోణాకారాల్లో యాగకుండాలను నిర్మించి తీర్చిదిద్దారు. మధ్యలో స్వామివారి వేదికకు ఇరువైపులా శంకు, చక్ర, తిరునామాలు అలంకరించారు. చుట్టూ వెదురు కర్రలను బిగించి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ దిశల్లో ద్వారాలను ఏర్పాటు చేశారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయాన్ని ఆదివారం రాష్ట్ర ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణతో దర్శనాలు పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానాలయం మాఢ వీధులు, ప్రాకారాలతో పాటు స్వామివారి మహారాజగోపురాలను వీక్షించారు. అంతకుమందు బాలాలయంలో సువర్ణమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయరీతిలో స్వాగతం పలికి, బాలాలయ ముఖ మండపంలో ఆశీర్వచనం అందజేశారు. పరిశీలించిన వారిలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్రెడ్డి, ప్రత్యేక కార్యదర్శులు నరసింగరావు, శాంతకుమారి, రాణీకుమిదిని, సునీల్ శర్మ, రామకృష్ణ, హర్భిద్ సింగ్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, కలెక్టర్ పమేలాసత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఉన్నారు.
బాలాలయంలో రాష్ట్ర అధికారులకు ప్రసాదం అందజేస్తున్న ఆలయ ఈఓ
యాదాద్రి, మార్చి 20 : ప్రధానాలయం ముఖమండపం పసిడి కాంతి వెదజల్లుతున్నది. ప్రతి కట్టడాన్నీ స్వర్ణ కవచాలతో రూపొందించారు. స్వామివారి గర్భాలయ ద్వారం పైభాగంలో ఉన్న లక్ష్మీనరసింహుడికి బంగారు మకర తోరణం అలంకరించారు. దీనిని వికారాబాద్కు చెందిన దాత దేవులపల్లి మహేందర్రెడ్డి రూ.8.10 లక్షల విలువైన బంగారంతో తాపడం తయారు చేయించి బహూకరించారు.
గర్భాలయం గోడపై లక్ష్మీనరసింహుడికి అమర్చిన బంగారు మకర తోరణం
యాదాది, మార్చి 20 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి హైదరాబాద్కు చెందిన ఓ దాత బంగారు సామగ్రిని బహూకరించారు. ముసారాంబాగ్కు చెందిన పోగుల రాములు సుమారు రూ. 22లక్షల విలువ గల బంగారు బావి తాపడంతోపాటు, 2 బంగారు సింహాసనాలు, బావిలో నుంచి నీళ్లను తోడేందుకు బంగారు బకెట్ను శనివారం అందజేశారు. ప్రధానాలయంలో స్వామివారి వేంచేపునకు 2 సింహాసనాలు వినియోగిస్తారు. గర్భాలయం వెనుక భాగంలో గల స్వామివారి బావికి బంగారుతాపడం అమర్చి, అభిషేకానికి శుద్ధ జలాలను తీసేందుకు బంగారు బకెట్ను వినియోగించనున్నారు.
స్వామివారికి సమర్పించేందుకు బంగారు బకెట్ను తీసుకువస్తున్న దాతలు
యాదాద్రికి చేరుకున్న స్వామివారి బావి (బంగారు తాపడం)
మహాకుంభసంప్రోక్షణలో భాగంగా ఆలయ ప్రాంగణాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రహదారికి మధ్యలో విద్యుద్దీపాలు అమర్చగా, స్వామివారి ప్రధానాలయానికి స్వర్ణ వర్ణపు విద్యుద్దీపాలంకరణ చేపట్టారు. ఉత్సవాలకు హాజరయ్యే వీవీఐపీ, వీఐపీలు, భక్తులకు స్వాగతం పలికేలా స్వాగత తోరణాలు అమర్చుతున్నారు. ప్రధాన రోడ్ల మధ్యలో ఈ తోరణాల బిగింపు ప్రక్రియ సాగుతున్నది. హైదరాబాద్లోని ఉప్పల్ చౌరస్తా నుంచి మేడిపల్లితో పాటు రాయగిరి, వంగపల్లి రోడ్డు, తుర్కపల్లికి వెళ్లే రోడ్డు, యాదగిరిపల్లి రోడ్డు, యాదగిరిగుట్ట పట్టణం బస్టాండ్ ప్రాంతంతో పాటు పలు ప్రాంతాల్లో తోరణాలు భక్తులకు స్వాగతం పలుకనున్నాయి.
యాదగిరిగుట్టలో స్వాగత తోరణం
యాదాద్రిలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో స్వామివారి ప్రాంగణంలో సందడి నెలకొన్నది. ఆలయ వీధులు, లడ్డూప్రసాద విక్రయశాల, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. వీఐపీ దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. బాలాలయంలో కవచమూర్తుల నిత్యారాధనలు తెల్లవారుజామునే ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లకు అర్చకులు నిజాభిషేకం చేపట్టి, ఆరాధన పర్వాలను కొనసాగించారు. భక్తులతో నిర్వహించే సువర్ణ పుష్పార్చన కైంకర్యాలలో భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్ట ఆలయంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి ఖజానాకు రూ. 21,12,978 ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు.
యాదాద్రి కొండపై భక్తులు
ప్రధాన బుక్కింగ్ ద్వారా 2,63,650
రూ. 100 దర్శనాలు 6,500
వీఐపీ దర్శనాలు 3,75,000
వేద ఆశీర్వచనం 2,400
సుప్రభాతం 1,700
క్యారీ బ్యాగుల విక్రయం 15,000
వ్రత పూజలు 1,38,400
కళ్యాణకట్ట టిక్కెట్లు 40,200
ప్రసాద విక్రయం 7,86,850
వాహనపూజలు 15,500
టోల్గేట్ 910
అన్నదాన విరాళం 12,582
సువర్ణ పుష్పార్చన 1,33,400
యాదరుషి నిలయం 66,340
పాతగుట్ట నుంచి 95,650
గోపూజ 100