వెస్టిండీస్తో వన్డే సిరీస్లో భారత్ వైట్వాష్పై గురిపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ దక్కించుకున్న టీమ్ఇండియా..మూడో వన్డేలోనూ విజయదుందుభి మోగించాలని చూస్తున్నది. సొంతగడ్డపై పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్న రోహిత్సేన..విండీస్పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నది. వరుసగా 11వ సారి ద్వైపాక్షిక సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించేందుకు మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నది. కరోనా నుంచి కోలుకున్న ధవన్ తిరిగి జట్టులోకి రావడం ఖాయం కాగా, పలు మార్పులు, చేర్పులు జరిగే అవకాశముంది. ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న విండీస్ కనీసం పోటీనివ్వాలన్న పట్టుదలతో కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆఖరి పోరు రసవత్తరంగా సాగే అవకాశముంది.
అహ్మదాబాద్: భారత్, వెస్టిండీస్ వన్డే పోరు ఆఖరి అంకానికి చేరుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పూర్తి బయోబబుల్ ఏర్పాట్ల మధ్య సాగుతున్న సిరీస్లో టీమ్ఇండియా తమదైన ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. పరిమిత ఓవర్ల కెప్టెన్గా పూర్తిస్థాయి బాధ్యతలు అందుకున్న రోహిత్శర్మ సారథ్యంలో టీమ్ఇండియా..విండీస్పై అన్ని విభాగాల్లో పైచేయి సాధించింది. గత మ్యాచ్లో స్వల్ప స్కోరుకే పరిమితమైనా..ప్రసిద్ధ్ కృష్ణ సూపర్ బౌలింగ్తో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో భారత్లో చూసిన అద్భుత స్పెల్ అంటూ కెప్టెన్ రోహిత్..ప్రసిద్ధ్పై ప్రశంసలు కురిపించాడు. పదునైన పేస్కు స్వింగ్ను జోడిస్తూ విండీస్ బ్యాటర్లను ప్రసిద్ధ్ ఓ ఆటాడుకున్నాడు. నాలుగు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగుల పొదుపు పాటించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. బౌలింగ్ పరంగా యువ క్రికెటర్లు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంటే..బ్యాటర్లు మాత్రం ఒకింత తడబడుతున్నారు. రెండో వన్డేలో రిషబ్ పంత్తో ఓపెనర్ ప్రయోగం విఫలమైంది. రోహిత్కు జతగా ఇన్నింగ్స్ ప్రారంభించిన పంత్..అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అనుభవజ్ఞుడైన విరాట్ కోహ్లీ బ్యాటు ఝులిపించడంలో తడబడుతున్నాడు. సీనియర్లు విఫలమైన చోట సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా రాణించడంతో టీమ్ఇండియాకు పోరాడే స్కోరు దక్కింది. మరోవైపు విండీస్ జట్టులో సమిష్టితత్వం లోపించింది. గాయంతో కీరన్ పొలార్డ్ దూరమైన వేళ జట్టు పగ్గాలు అందుకున్న నికోలస్ పూరన్ సహచరుల్లో ఆత్మవిశ్వాసం నింపలేకపోయాడు. ఛేదించాల్సి స్వల్ప లక్ష్యమైనా..బ్యాటర్లు విఫలం కావడం విండీస్ గెలుపు అవకాశాలను దెబ్బతీసింది.
మార్పులకు మొగ్గు:
కరోనా నుంచి కోలుకున్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్..తుది జట్టులోకి రావడం ఖాయమైంది. రోహిత్శర్మ కూడా ఒక ప్రకటనలో దీన్ని ధృవీకరించాడు. ధవన్ జట్టులోకి వస్తే.. మిడిలార్డర్లో మార్పులు చోటు చేసుకుంటాయి. రెండు వన్డేల్లో ఆకట్టుకున్న ఆల్రౌండర్ దీపక్ హుడాను తప్పించవచ్చు. ధవన్ జతగా రోహిత్ ఓపెనింగ్కు దిగితే.. కోహ్లీ, సూర్యకుమార్, రాహుల్, పంత్ మిడిలార్డర్ భారాన్ని మోయనున్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. ప్రస్తుతం బెంచ్మీదున్న అవేశ్ఖాన్, కుల్దీప్ యాదవ్కు అవకాశమిచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ లేదా చాహల్కు బదులుగా కుల్దీప్ యాదవ్ లేదా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తీసుకునేందుకు మేనేజ్మెంట్ మొగ్గుచూపవచ్చు. పేస్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ నిలకడగా రాణిస్తుండగా, హైదరాబాదీ స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ స్థానంలో ఇండోర్ యువ పేసర్ అవేశ్ఖాన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే భారీ మార్పులతో భారత్ మూడో వన్డేలో బరిలోకి దిగనుంది.
పరువు కోసం విండీస్
ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న విండీస్…కనీసం పరువైన కాపాడుకోవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నది. జట్టు నిండా హార్డ్హిట్టర్లు కనిపిస్తున్నా…స్థాయికి తగ్గ ఆటతీరును కనబరుచడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా షాయి హోప్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, హోల్డర్ రాణిస్తే..విండీస్కు తిరుగుండకపోవచ్చు. ఇదిలా ఉంటే గత 17 మ్యాచ్ల్లో 11 సార్లు 50 ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోవడం వారి బ్యాటింగ్ తీరుకు అద్దం పడుతున్నది. గత రెండు మ్యాచ్ల్లోనూ 200 లోపు స్కోర్లకే విండీస్ పరిమితమైంది. రెండో వన్డేలో రోచ్, జోసెఫ్, స్మిత్, అలెన్, హుసేన్ టీమ్ఇండియా బ్యాటర్లను కట్టడి చేసినా..ఫలితం లేకపోయింది. స్వల్ప లక్ష్యఛేదనలో బ్యాటర్లు విఫలం కావడం విండీస్ను ఓటమి వైపు నిలిపింది.
జట్ల అంచనా
భారత్: రోహిత్శర్మ(కెప్టెన్), ధవన్, కోహ్లీ, రాహుల్, పంత్, దీపక్ హుడా/సూర్యకుమార్, సుందర్, శార్దుల్ ఠాకూర్, సిరాజ్, చాహల్/కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
వెస్టిండీస్: పొలార్డ్(కెప్టెన్), హోప్, కింగ్, బ్రావో, బ్రూక్స్, పూరన్, హోల్డర్, అలెన్, హుస్సేన్, జోసెఫ్, రోచ్
పిచ్, వాతావరణం
పిచ్ ఇప్పటి వరకు పేసర్లకు, స్పిన్నర్లకు సహకరించింది. శుక్రవారం మూడో వన్డేలో కూడా దాదాపు ఇదే విధంగా స్పందించవచ్చు. తేమ అంతగా ప్రభావం చూపించకపోవచ్చు.