టీమ్ఇండియాలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సిద్ధమైపోండి! రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్ రూపంలోని భారత నాయక త్రయం పగ్గాలు అందుకోబోతున్నది. వ్యక్తిత్వాలు, వ్యవహారశైలి పరంగా విభిన్నంగా ఉండే ఈ ముగ్గురు పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియాను ముందుకు నడిపించేందుకు సిద్ధమయ్యారు. సహనానికి ద్రవిడ్ నిలువెత్తు నిదర్శనమైతే..చురుకైన నాయకత్వానికి రోహిత్, దూకుడు తనానికి రాహుల్ తార్కాణాలు. ఈ ముగ్గురు కలిస్తే ప్రత్యర్థులకు ఇక దడే. టీ20 ప్రపంచకప్ వైఫల్యాన్ని న్యూజిలాండ్ సిరీస్తో చెరిపేయాలని భారత్ భావిస్తుంటే..తృటిలో కప్ చేజార్చుకున్న కివీస్ మళ్లీ పుంజుకోవాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో జైపూర్లో నేడు ఆసక్తికర పోరుకు రంగం రెడీ అయ్యింది.
జైపూర్: తీరిక లేని షెడ్యూల్తో ఆటగాళ్లు అలిసిపోవడం వల్లే టీ20 ప్రపంచకప్లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలోనే.. టీమ్ఇండియా మరో సిరీస్కు సిద్ధమైంది. మెగాటోర్నీ ముగిసి మూడు రోజులు గడవక ముందే రోహిత్ సేన తిరిగి మైదానంలో అడుగుపెట్టనుంది. బయోబబుల్లో ఎక్కువ కాలం ఉండటం ప్లేయర్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని క్రీడాలోకం గగ్గోలు పెడుతున్నా.. బోర్డు మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నది. ఆదివారం పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన న్యూజిలాండ్.. ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా జైపూర్ చేరగా.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం ఇక్కడి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో తొలి టీ20 జరుగనుంది. టీ20 వరల్డ్కప్తో విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలకడంతో ఐదేండ్ల తర్వాత భారత జట్టు కొత్త సారథి నేతృత్వంలో బరిలోకి దిగనుంది. పూర్తి స్థాయి కెప్టెన్గా రోహిత్ శర్మకు, హెడ్కోచ్గా ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్కు ఇదే తొలి మ్యాచ్ కానుండటం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనుండటంతో రోహిత్-రాహుల్ జోడీ.. జట్టు కూర్పుపై ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించనుంది. నెలాఖరులో టెస్టు సిరీస్ జరుగనుండటంతో ఇరు జట్లు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చాయి. విరాట్ కోహ్లీతో పాటు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ వంటివారికి టీమ్ఇండియా రెస్ట్ ఇస్తే.. టెస్టు సిరీస్పై దృష్టిసారించేందుకు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పొట్టి ఫార్మాట్కు దూరమయ్యాడు. దీంతో సీనియర్ పేసర్ టీమ్ సౌథీ బ్లాక్ క్యాప్స్కు సారథ్యం వహించనున్నాడు.
‘ఫార్మాట్కు ఒక జట్టు గురించి ఆలోచించడం లేదు. ఆటగాళ్లను తాజాగా ఉంచడం ముఖ్యం. కొందరు ప్లేయర్లు ఏదో ఒక ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. మరికొందరు మూడు ఫార్మాట్లలో కీలకంగా ఉన్నారు. అలాంటి వారికి తగినంత విశ్రాంతినిస్తు ముందుకు సాగుతాం. మూడు ఫార్మాట్లు ముఖ్యమైనవే. టీ20, వన్డే ప్రపంచకప్లతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లను దృష్టి పెట్టుకొని ప్రణాళికలు రచిస్తాం. ఆటగాళ్లకు అందుబాటులో ఉంటూ వారిని అర్థం చేసుకొని దానికి తగ్గట్లు బాధ్యతలు అప్పగించడం నా నైజం. అండర్-19 స్థాయిలో ఇదే అమలు చేశా. ఇప్పుడు అదే కొనసాగిస్తానని కచ్చితంగా చెప్పలేకపోయినా.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పాడుపడతా.
-రాహుల్ ద్రవిడ్,
జట్టులో విరాట్ స్థానం మారదు. అతడు మా ప్రధాన ఆటగాడు. కోహ్లీ జట్టులోకి వస్తే మా బలం మరింత పెరుగుతుంది. అతడి అనుభవం, నైపుణ్యం అదనపు బలాన్నిస్తాయి. ప్రదర్శన ఆధారంగా కాకుండా.. ఆటగాళ్లు విఫలమైనా వాళ్లకు అండగా నిలుస్తాం. ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయినా టీ20 ఫార్మాట్లో మాది బలమైన జట్టే. రాహుల్ ద్రవిడ్తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. మ్యాచ్ను బట్టి ప్లేయర్ల బాధ్యతలు మారిపోతుంటాయి. మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక విధంగా.. ఛేజింగ్లో మరో విధంగా సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ జట్టుకు ఎంత అవసరమో మాకు తెలుసు. అలాంటి వారిని తీర్చిదిద్దాలి.
-రోహిత్
పిచ్, వాతావరణం
సవాయ్ మాన్సింగ్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలించనుండగా.. వాయు కాలుష్యం కారణంగా తేమ ప్రభావంపై సరైన అంచనా వేయడం కష్టం. రెండో ఇన్నింగ్స్లో బంతిపై పట్టు చిక్కే చాన్స్ లేకపోవడంతో..టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్కే మొగ్గుచూపొచ్చు. మ్యాచ్కు వర్ష సూచనలేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్, వెంకటేశ్/శ్రేయస్, సూర్యకుమార్, పంత్, అక్షర్, అశ్విన్, భువనేశ్వర్, సిరాజ్, చాహల్.న్యూజిలాండ్: సౌథీ (కెప్టెన్), గప్టిల్, మిచెల్, ఫిలిప్స్, చాప్మన్, సీఫెర్ట్, నీషమ్, శాంట్నర్, జెమీసన్, మిల్నే/ఫెర్గూసన్, సోధి.
టెస్టు ప్రాక్టీస్
ముంబై: ఓవైపు రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత టీ20 జట్టు.. న్యూజిలాండ్తో తలపడేందుకు సిద్ధమవుతుంటే.. టెస్టు స్పెషలిస్టులు మాత్రం ప్రాక్టీస్లో మునిగిపోయారు. ఈనెల 25న కన్పూర్ వేదికగా భారత్, కివీస్ మద్య ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ మైదానంలో చెమటోడుస్తున్నారు. మంగళవారం ముంబై క్రికెట్ అసోసియేషన్ మైదానంలో రహానే, పుజారా, ఇషాంత్, జయంత్ యాదవ్, శుభ్మన్ గిల్, వికెట్కీపర్లు వృద్ధిమాన్ సాహా, కోన శ్రీకర్ భరత్, ఉమేశ్ యాదవ్ తీవ్రంగా శ్రమించారు. తొలి టెస్టుకు విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో రహానే సారథ్యం వహించనుండగా.. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ గైర్హాజరీలో ఇషాంత్ శర్మ బౌలింగ్ యూనిట్కు నాయకత్వం వహించనున్నాడు.
యువ ఆటగాళ్లకు చాన్స్
భారీ అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్లో అడుగుపెట్టి తొలి రెండు మ్యాచ్ల్లో వరుసగా పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో అవమానకర ఓటములు మూటగట్టుకున్న టీమ్ఇండియా.. తిరిగి గాడిన పడేందుకు ఈ సిరీస్ను వినియోగించుకోవాలని భావిస్తుంటే.. మెగాటోర్నీ ఫైనల్లో పరాజయాన్ని పక్కనపెట్టి ముందుకు సాగాలని న్యూజిలాండ్ చూస్తున్నది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇరు జట్లు కొత్త కుర్రాళ్లకు చాన్స్ ఇవ్వనున్నాయి. మెగాటోర్నీలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో.. అతడి స్థానంలో ఎంపిక చేసిన ఐపీఎల్ హీరో వెంకటేశ్ అయ్యర్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి! వచ్చే ఏడాది జరుగనున్న మెగాటోర్నీ కోసం అతడిని సిద్ధం చేయాలంటే వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సిందే. రుతురాజ్ గైక్వాడ్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్లకు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. బుమ్రా గైర్హాజరీలో సీనియర్ భువనేశ్వర్ కుమార్తో పాటు హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ పేస్ భారం మోయనుండగా.. స్పిన్ కోటాలో అశ్విన్, చాహల్, అక్షర్ బరిలోకి దిగనున్నారు. ప్రస్తుత జట్టులో ఐదుగురు ఓపెనర్లు అందుబాటులో ఉండటంతో రోహిత్-కేఎల్ రాహుల్కు బదులు మరో జోడీని ప్రయత్నిస్తారా చూడాలి. వెంకటేశ్ అయ్యర్ను హిట్టర్గా వాడుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.