సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): పారిశ్రామికవేత్తలు… వందలు, వేల కోట్ల పెట్టుబడులతో వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాదు.. జాతీయ సంపదలోనూ తమ వంతు పాత్రను పోషిస్తారు. అందుకే సమాజంలో పారిశ్రామికవేత్తలంటే ఆ మేరకు ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏ ప్రభుత్వమైనా పారిశ్రామికవేత్తలకు ఎర్ర తివాచీ పరిచి తద్వారా సమాజ హితాన్ని ఆకాంక్షిస్తుంది. తద్వారా ప్రభుత్వాలు-పారిశ్రామికవేత్తల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. కానీ… ఎనిమిదేండ్ల కిందట పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పది మందికి ఉపాధి కల్పించేవారు ఏకంగా రోడ్డెక్కి నిరసన తెలిపారు. చివరకు ఇందిరాపార్కు దగ్గర గంటల తరబడి ధర్నాలు చేశారు.
ఇదేదో భూముల కోసం కాదు… ప్రభుత్వం ఇన్సెంటివ్లు ఇవ్వాలని అంతకంటే కాదు. కేవలం తమకు సరైన కరెంటునిస్తే… ఉత్పత్తిని కొనసాగిస్తామని వేడుకున్నారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా కరెంటు కోసం గళం విప్పారు. ఇదీ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంటు సరఫరా వ్యవస్థ దుస్థితి. మరి ఇప్పుడు?! దేశంలోని అనేక రాష్ర్టాల్లో కరెంటు సంక్షోభం. అంతెందుకు… పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది గంటల పాటు పరిశ్రమలకు కరెంటు సరఫరా. అందునా.. వారంలో మూడు రోజులు పవర్ హాలిడే. దీంతో ఆర్డర్లకు సరిపడ ఉత్పత్తిలేక పారిశ్రామికవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. కానీ… తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సెకను కూడా కరెంటు కోత లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎండాకాలం వచ్చిందంటే చాలు… రోజుకు ఉదయం 9-12 గంటలు అంటే కేవలం మూడు గంటల కరెంటు సరఫరా నుంచి ఇప్పుడు 24 గంటల సరఫరాతో ఏ, బీ, సీ మూడు షిఫ్టుల్లోనూ జోరుగా ఉత్పత్తి సాగుతున్నది. సామర్థ్యం, అవకాశం ఉండాలేగానీ… కంపెనీ విస్తరణలకూ సరిపడ కరెంటు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే హైదరాబాద్ చుట్టూ ఉన్న పరిశ్రమలు క్షణం తీరక లేకుండా నడుస్తున్నాయి. స్థానికులే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులు కూడా చేతినిండా పనితో హాయిగా ఉంటున్నారు. మరి దీనంతటికీ కారణం… సీఎం కేసీఆర్ తయారు చేసిన పకడ్బందీ విద్యుత్ వ్యవస్థ అని పారిశ్రామికవేత్తలు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆ సంతోషం వారి మాటల్లోనే…
జిల్లాకో యూనిట్ నడుపుతున్నా..
ఉమ్మడి రాష్ట్రంలో పవర్ కట్ అనే అంశం చాలా దారుణంగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళా కార్మికులకు ఎంతో మేలు జరిగింది. ఇంటిలో పని చేసుకొని మధ్యాహ్నం పూట కూడా సెకండ్ యాక్టివిటీలో భాగంగా పనులు చేసుకుంటున్నారు. దీంతో ఉపాధికి కొదవ లేదు. గతంలో కరెంట్ పోతదేమో అనే ఆందోళన.. తెలంగాణ వచ్చాక తీరింది. బనానా ఫైబర్, బాంబూ ఫైబర్తో నాప్కిన్స్ తయారు చేస్తున్నాము. నిరంతర పవర్ డిస్ట్రిబ్యూషన్ వల్ల ప్రతి జిల్లాకో యూనిట్ను నడుపగలుగుతున్నాను.
– అరుణ, మహిళా పారిశ్రామికవేత్త
నిరంతర విద్యుత్ అద్భుతం
2014కు ముందు సమ్మర్ వచ్చిందంటే పవర్ సమస్య ఉండేదని బెంగపడేవాళ్లం. ఒకప్పుడు విద్యుత్ ఎప్పుడస్తదో అని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొని ఉండేది. ఇప్పుడా పరిస్థితి దరిదాపులా కూడా లేదు. ఇది చాలా గొప్ప విషయం. తెలంగాణ ప్రభుత్వానికి మహిళలందరూ రుణపడి ఉంటారు. నేను బొటిక్ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేస్తుంటాను. చాలా మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నాను. పారిశ్రామికవర్గాలకు నిరంతరాయంగా విద్యుత్ను అందజేస్తుండటం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేరు.
– మంజురెడ్డి, మాన్సే ఫౌండర్ (కొవె)
పవర్తోనే భవితకు పునాది
నేను ఘట్కేసర్లో బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేశాను. 20మందికి ఉపాధిని కల్పిస్తున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత పవర్ హాలీడే మాట పాతబడిపోయింది. యువ పారిశ్రామికవేత్తల బంగారు భవిష్యత్తుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పవర్తో పునాది వేసినట్లేనని నా అభిప్రాయం. ఉమ్మడి రాష్ట్రంలో నాలాంటి కుటీర పరిశ్రమలు నడిపే యువత తిప్పలు ఎదుర్కొన్న సందర్భం గుర్తుకు వస్తే పానం ఝల్లుమంటుంది. ఇప్పుడు పనిచేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– అరుణ్కుమార్, యువ పారిశ్రామికవేత్త (డిక్కీ)
కరెంట్ వల్లే లాభాలు
తెలంగాణ వచ్చాకే హబ్సిగూడలో చిన్నతరహా ఆయిల్ మిల్స్ నడిపేది. కరెంట్ కోతలు లేకపోవడంతో నిత్యం వ్యాపారం బాగా నడిచేది. అందువల్ల నాతో పాటు మరో నలుగురు యువత ఉపాధి పొందేవారు. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహమే. నిరంతర విద్యుత్ పంపిణీతో ఎలాంటి నష్టాలు లేకుండా లాభాలను ఆర్జించాను. వ్యాపార రంగంలో ఆర్థిక స్థిరీకరణ సాధించాను. అందుకే యువ పారిశ్రామికవేత్తలు తెలంగాణ ప్రభుత్వం కల్పించే పథకాలను స్వాగతించాలి
– దాసరి నారాయణ, కోఆర్డినేటర్ (డిక్కీ)
పరిశ్రమలు ఉత్పత్తులు పెంచాయి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు ఎక్కువ. పరిశ్రమలు, రైస్ మిల్లుల యజమానులతో కలిసి ఇందిరాపార్క్ వద్ద నిరసన కూడా చేపట్టాం. తెలంగాణ వచ్చాక నిరంతర విద్యుత్ సరఫరా ఉంది. పరిశ్రమలు తమ ఉత్పత్తులను పెంచాయి. ఆంధ్రప్రదేశ్లో కరెంట్ కోతలతో సగం పరిశ్రమలు బంద్ చేసుకునే పరిస్థితి నెలకొన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరాయంగా విద్యుత్ అందిస్తుండడంతో పరిశ్రమల యజమానులు సంతోషంగా ఉన్నారు.
– మీలా జయదేవ్, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు
కరెంట్ కోసం ధర్నా చేసేవాళ్లం
సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతలు ఎక్కువ. కరెంటు కోసం ఇందిరా పార్కు వద్ద ధర్నా చేసేవాళ్లం. అప్పట్లో ఒకటే షిఫ్ట్లో కార్మికులు పని చేసేవారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే పరిశ్రమలకు కరెంటు సరఫరా అయ్యేది. తెలంగాణ వచ్చాక కరెంట్ నిరంతరాయంగా సరఫరా అవుతున్నది. మూడు షిఫ్ట్లలో కంపెనీని నడిపిస్తున్నాం. డీజిల్ ఖర్చు లేనేలేదు.
– జి.సత్యనారాయణ, సత్య ఫ్యాబ్రికేటర్స్, జీడిమెట్ల
ఇపుడు ఉపాధికి ఢోకాలేదు
నేను పదేండ్లుగా ఇంటర్నెట్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నా. సమైక్య రాష్ట్రం నాటి రోజులను గుర్తు చేసుకుంటేనే కండ్లలో నీళ్లు తిరుగుతాయి. కరెంట్ కట్లతో వ్యాపారం ఎప్పుడూ సరిగా నడవకపోయేది. కనీసం జిరాక్స్ పని కూడా లేకుండా ఖాళీగా కూర్చునేవాణ్ణి. ఎండాకాలంలో జేబు నుంచి కిరాయి కట్టాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చాక కరెంట్ నిరంతరాయంగా ఉంటుంది. ఇపుడు చేతినిండా పని ఉంటుంది. కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్లు పని చేస్తుండటంతో మా ఉపాధికి ఎటువంటి ఢోకాలేదు.
– బాలాజీ, ఇంటర్నెట్ కేంద్రం నిర్వాహకుడు
జనరేటర్ ఖర్చు లేదు..
ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న కరెంట్ కష్టాల కారణంగా రూ. 30 లక్షల వ్యయంతో జనరేటర్ ఏర్పాటు చేశాం. జనరేటర్ నడవడం కోసం డీజిల్ వాడకం భారంగా ఉండేది. డీజిల్ రోజుకు కనీసం రూ 20 వేలు ఖర్చు అయ్యేది. అంతేగాక జనరేటర్కు నెలనెలా మెయింటెనెన్స్ తప్పేవి కాదు. వచ్చిన ఆదాయమంతా కార్మికుల జీతాలు, మెయింటెనెన్స్లకు సరిపోయేది. ఏడున్నరేండ్లుగా జనరేటర్ అసరం లేకుండా పోయింది. ఖర్చులు పూర్తిగా తగ్గాయి. 24 గంటలు కరెంట్ ఉంటుంది. ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి..
– ప్రొడక్షన్ మేనేజర్ గోపాల్, టిబ్రేవాలా ఎలక్ట్రోమెక్ పరిశ్రమ
వ్యాపారంలో నష్టం లేదు
మాది చిన్న కిరాణా షాపు. ఇరువై ఏండ్లుగా వ్యాపారం చేస్తున్నా. గతంలో ఎండాకాలంలో కరెంటు సరిగ్గా ఎప్పుడూ ఉండేది కాదు. ఇన్వర్టర్ ఉన్నా లైట్, ఫ్యాన్ తిరగడానికి మాత్రమే పని చేసేది. ఫ్రిజ్లోని పాలు, పెరుగు, కూరగాయలు పాడయిపోయేవి. వ్యాపారంలో నష్టం వచ్చేది. ఈ ఏడేండ్లలో కరెంటు కట్ అన్న మాట మర్చిపోయాం. నష్టాలు లేకుండా వ్యాపారం సాఫీగా సాగుతున్నది. నిర్విరామంగా కరెంట్ అందిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– వెంకటేశ్, కిరణాషాపు వ్యాపారి, పర్వత్నగర్, అల్లాపూర్ డివిజన్
డీజిల్ వాడడం లేదు
జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఫార్మా బల్క్డ్రగ్స్ పరిశ్రమలలో రెండు రెట్లు ఉత్పత్తులు పెరిగాయి. డీజిల్ను వాడడం పూర్తిగా మానేశాం. కరెంటునే వాడుతున్నాం. నిర్వహణ ఖర్చు తగ్గడంతో పాటు ఉత్పత్తులు పెరగడంతో లాభాలను అర్జిస్తున్నాం. చాలా కెమికల్ పరిశ్రమలలో బొగ్గునే ఎక్కువగా వాడుతున్నారు. మూడు షిఫ్ట్లలో కంపెనీని నడిపించడంతో ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి లభిస్తున్నది. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్నారు.
– కే.వి.రామారావు, విజయశ్రీ కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, జీడిమెట్ల
మంచి లాభాలు సాధిస్తున్నాం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంట్ కోతల వల్ల తీవ్రంగా నష్టపోయాం. ఒక దశలో పరిశ్రమలను నడిపించలేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నిత్యం ఎనిమిది గంటల విద్యుత్ కోతతో పాటు అదనంగా వారంలో మూడు రోజులు పవర్ హాలిడే ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పరిశ్రమలకు పునర్జీవం లభించింది. నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తుండడంతో మంచి లాభాలు సాధిస్తున్నాం. మరో వైపు ప్రభుత్వం కూడా పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహిస్తుండడం విశేషం.
– సుధీర్రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
జనరేటర్లకు స్వస్తి పలికాం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంట్ కష్టాలు చెప్పేలేనంతగా ఉండేవి. విద్యుత్ కోతలతో పరిశ్రమలను నడిపించేందుకు లక్షలాది రూపాయాలు ఖర్చు చేసి జనరేటర్లను ఏర్పాటు చేసుకున్నాం. దీనివల్ల ఉత్పత్తుల పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరిగేది. ధర ఎక్కువ కావడం వల్ల మార్కెట్ సరిగ్గా లేకపోయేది. తెలంగాణ వచ్చిన తరువాత నిరంతరం విద్యుత్ సరఫరాతో పరిశ్రమలు పూర్తి స్థాయిలో నడిపిస్తున్నాం. జనరేటర్లకు పనిలేకుండాపోయింది. ఫలితంగా ఖర్చు తగ్గింది.. లాభాలు పెరిగాయి.
– వెంకటేశ్వర్రెడ్డి, పారిశ్రామికవేత్త, గణేశ్ రిగ్స్ అధినేత
ఇప్పుడే లాభాలు వస్తున్నాయి
సమైక్య రాష్ట్రంలో కరెంట్ కోతలతో పరిశ్రమలన్నీ కుదేలయ్యాయి. అపుడు పరిశ్రమలు ఒకే షిఫ్ట్లో పని చేసేవి. వారికి కూడా కరెంట్ లేక సరిగ్గా పని లేకపోయేది. దానివల్ల ఎంతో కార్మికులు ఉపాధి కోల్పోయారు. తెలంగాణ వచ్చిన తరువాతనే పరిశ్రమలు మూడు షిఫ్ట్ల్లో నడుస్తున్నాయి. ఉత్పత్తులు పెరిగి లాభాలు కూడా వస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాం. ఇదే సమయంలో కార్మికులకు సకాలంలో జీతాలు కూడా చెల్లిస్తున్నాం.
– మియ్యపురం రమేశ్, చర్లపల్లి ,పారిశ్రామికవాడ ఫేజ్-3 సీఐఏ అధ్యక్షుడు