కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ( Abhishek Banerjee ) కాన్వాయ్పై సోమవారం దాడి జరిగింది. అభిషేక్ బెనర్జీ ఈ రోజు త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ జెండాలు పట్టుకున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్పై దాడి చేశారు. కాగా, బీజేపీ నేతలే తనపై దాడి చేయించారని అభిషేక్ బెనర్జీ ట్విట్టర్లో ఆరోపణలు చేశారు.
”బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది. విప్లవ్ దేవ్ మీరు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను” అంటూ తన కాన్వాయ్పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను అభిషేక్ ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా, పొరుగు రాష్ట్రంలో పర్యటిస్తున్న తమ ఎంపీ కారుపై దాడి చేయటాన్ని టీఎంసీ నాయకులు ఖండించారు. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ ఈ విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.