తిరుమల : నాణ్యత విషయంలో ఎలాంటి రాజీకి తావు లేకుండా దిట్టం మేరకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాలు తయారు చేస్తున్నామని తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయ పోటులో పనిచేస్తున్న శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు స్పష్టం చేశారు. డయల్ యువర్ ఈవో(Dial Your EO) కార్యక్రమంలో లడ్డూ నాణ్యతకు సంబంధించి పలువురు భక్తులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని టీటీడీ అధికారులు పోటు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
పోటులో పనిచేస్తున్న పలువురు శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు మాట్లాడుతూ తాము కొన్ని తరాలుగా పారంపర్యంగా లడ్డూ తయారీలో నైపుణ్యం సాధించామని చెప్పారు. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి, శనగపిండి, చక్కెర ఎండు ద్రాక్ష, బాదం తదితర అన్ని దినుసులను దిట్టం ప్రకారం టీటీడీ అధికారులు అందిస్తున్నారని పేర్కొన్నారు. వీటిని వినియోగించి నాణ్యంగా లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నామని వివరించారు.
ఈ మేరకు లడ్డూ నాణ్యత తగ్గే అవకాశం లేదని చెప్పారు. ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ శ్రీహరి, పోటు పేష్కార్ శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు.