తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ఆలయంలో సేనాధిపతి విశ్వక్సేనుడి పర్యవేక్షణలో విశేష సమర్పణ కావిస్తారు. అనంతరం నాలుగు మాడవీధుల్లో ఊరేగించనున్నారు. మండపంలో శాస్త్రోక్త కార్యక్రమాల మధ్య భూదేవి పూజ తర్వాత మృతిక సేకరించి ఆలయానికి చేరుకుంటారు.
అక్కడ అర్చకులు శాస్త్రోక్త పూజల అనంతరం అంకురార్పణ (బీజవాపం) కార్యక్రమం నిర్వహిస్తారు. దాంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. మంగళవారం సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేషవాహనాలతో బ్రహ్మోత్సవాల వాహనసేవలు ప్రారంభం అవుతాయి. వచ్చేనెల 2న సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య స్వర్ణ రథోత్సం నిర్వహించనున్నారు.