హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి పులుల వలస పెరుగుతున్నట్టు అటవీ అధికారులు భావిస్తున్నారు. తడోబా, తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పులుల సంఖ్య పెరగడం వల్ల అక్కడి పులులు కొత్త స్థావరాల కోసం గోదావరిని దాటి రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నట్టు గుర్తించారు. తెలంగాణలో కొంతకాలంగా పులులు ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అనువైన పరిస్థితులు పెరిగాయి. దీంతో అవి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అడవుల నుంచి వస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. వారంరోజులుగా భద్రాచలం-కొత్తగూడెం అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు ఆనవాళ్లు కనిపించాయి. బుధవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు, బయ్యారం అటవీ రేంజ్ పరిధిలో పెద్దపులిని స్థానికులు గుర్తించారు. బయ్యారం మండలం ఇసుకమేది, కార్లాయి, లక్ష్మీపురం, భీమ్లాతండాలో పులి ని చూసినట్టు స్థానికులు తెలిపారు. భీమ్లాతండా ప్రాంతంలో పశువులను మేపుతున్న తనపై పులి దాడికి వస్తే గొడ్డలితో ప్రతిఘటించినట్టు పశువుల కాపరి నారాయణ తెలిపా రు. గురువారం గూడూరు మండలం నేలవంచలో పశువుల మందపై దాడి చేసిన పులి రెండు ఆవులను చంపినట్టు స్థానికులు తెలిపారు. భద్రాచలం-కొత్తగూడెంలో కనిపించిన పులి, నేలవంచ, కార్లాయి అడవుల్లో సంచరిస్తున్నది ఒకటేనా? లేక వేర్వేరా? అనేది రెండుమూడు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ నుంచి పులుల వలస అనేది మంచి పరిణామంగా అధికారులు భావిస్తున్నారు.