Gadari Kishore |అర్వపల్లి : తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ కుమార్ ఉదారత చాటుకున్నారు. తల్లిదండ్రులకు దూరమై అనాథలుగా మిగిలిన బాలలకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి వారికి అండగా నిలిచారు.
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా అర్వపల్లి మండలంలోని అడివెంల గ్రామానికి చెందిన ఉడుగు హర్షవర్దన్, తన్వీశ్కుమార్ తండ్రి నాలుగేండ్ల క్రితం మృతిచెందాడు. భర్త మరణంతో కుంగిపోయి మతిస్థిమితం కోల్పోయిన ఝాన్నీ కొద్దిరోజలు క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఒంటరైన చిన్నారులు నానమ్మ దగ్గర జీవిస్తున్నారు. వీరికి ఉండేందుకు కనీసం ఇల్లు కూడా లేదనే విషయం తెలుసుకుని ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ కుమార్ చలించిపోయారు. తక్షణమే స్పందించి అనాథ బాలురకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించారు. అడివెంలలో శనివారం నిర్వహించిన డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపికలో ఈ అనాథ బాలలకు అధికారులు ఇల్లు కేటాయించారు. ఎమ్మెల్యే ఉదారతను చూసి ఆ గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తూ.. ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.