ప్రస్తుత పోటీ ప్రపంచంలో సర్కారు కొలువు వచ్చిందంటే జీవిత కల నెరవేరినట్లే. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ఓ పేద కుటుంబంలో ముగ్గురికీ సర్కారు కొలువులు రావడం విశేషమే. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఆ పిల్లలు బాగా చదువుకున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించి కుటుంబ కలను సాకారం చేశారు.
TSPSC | డొంకేశ్వర్, ఏప్రిల్ 16 : నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన బొమ్మెన గంగారాం, లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. వీరిది పేద కుటుంబం కావడంతో పిల్లలను చదివించేందుకు తండ్రి గంగారాం చాలా కష్టపడ్డారు. 1997లో అప్పు చేసి ఉపాధి కోసం దుబాయికి వెళ్లాడు. తల్లి లక్ష్మి బీడీలు చుడుతూ వచ్చిన డబ్బుతో ఇల్లు నడిపేది. భర్త కష్టం ద్వారా వచ్చిన డబ్బులతో ఓ పక్క అప్పులు తీరుస్తూ మరోపక్క పెద్ద కొడుకు పృథ్వీరాజ్, రెండో కుమారుడు దేవరాజ్, కుమార్తె శ్రీవాణిని చదివించేది. ముగ్గురు పిల్లలు చురుగ్గా ఉండడంతో ఎంత ఖర్చయినా భరిస్తూ కష్టపడి ఉన్నత విద్య చదివించారు. 20 ఏండ్లపాటు తల్లిదండ్రుల కష్టాలను చూసిన ఆ ముగ్గురు పిల్లలు పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు..
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పృథ్వీరాజ్, దేవరాజ్, శ్రీవాణి బాగా చదువుకున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఉన్నత చదువులు కొనసాగిస్తూనే ఉద్యోగాల వేటలో పడ్డారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల కావడంతో దరఖాస్తు చేసుకున్నారు. కష్టపడి పృథ్వీరాజ్ ఎస్సైగా, దేవరాజ్ జెన్కోలో ఏఈగా, శ్రీవాణి జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగాలు సాధించారు.
నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలనే ఆసక్తి ఉండేది. ఏడో తరగతి వరకు డొంకేశ్వర్ ప్రభుత్వ పాఠశాలలో చదివాను. 8వ తరగతిలో పోచంపాడ్ గురుకులంలో సీటు వచ్చింది. ఇంటర్ నిజామాబాద్ కాకతీయలో పూర్తిచేసి ఎంసెట్లో మంచి ర్యాంక్ రావడంతో సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈలో జాయిన్ అయ్యాను. గేట్ ఎగ్జామ్ రాసి ఒడిశా రాష్ట్రంలోని కమ్యూనికేషన్ విభాగంలో ఎంటెక్ పూర్తి చేశాను. 2018లో తెలంగాణ ప్రభుత్వం ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ వేసింది. కష్టపడి జాబ్ సాధించాను. ట్రైనింగ్ పూర్తయ్యాక 2020లో పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నా. నేను ఉద్యోగం సాధించడంతో మా అమ్మానాన్నల కల నెరవేరింది.
– బొమ్మెన పృథ్వీరాజ్, ఎస్సై, ఇంటెలిజెన్స్ విభాగం, హైదరాబాద్
చాలా గర్వంగా ఉంది..
మాది చాలా బీద కుటుంబం. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉండేది. మా పిల్లలు బాగా చదువుతుంటే ఎలాగైనా వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని అనుకున్నాం. ఎంత ఖర్చైనా వెనుకాడలేదు. మేము పడుతున్న కష్టాన్ని మా పిల్లలు కూడా గుర్తించారు. కష్టపడి చదువుకొని ముగ్గురూ సర్కారు కొలువులు సాధించారు. మా పిల్లలను అందరూ పొగుడుతుంటే గర్వంగా ఉంది.
– బొమ్మెన గంగారాం-లక్ష్మి, డొంకేశ్వర్
కుటుంబ సభ్యుల సహకారంతో..
నేను ఎనిమిదో తరగతి వరకు డొంకేశ్వర్, అక్కడి నుంచి ఇంటర్ వరకు కాకతీయలో చదివాను. మంచి మార్కులు రావడంతో ఉస్మానియాలో డిగ్రీ పూర్తి చేశాను. 2018లో టీఎస్పీఎస్సీ ద్వారా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రిపేర్ అయ్యాను. 2020లో జాబ్ సాధించాను. ప్రస్తుతం నవీపేట మండలం ఆశాజ్యోతి కాలనీ గ్రామంలో పని చేస్తున్నా. మా అన్నయ్యలు, అమ్మానాన్న చాలా సహకరించారు. ప్రభుత్వ ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది.
– బొమ్మెన శ్రీవాణి, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, ఆశాజ్యోతి కాలనీ గ్రామం, నవీపేట మండలం
అన్న ప్రోత్సాహంతో..
నాకు చదువుతోపాటు ఆటలూ ఇష్టం. ఏడోతరగతి వరకు డొంకేశ్వర్లో చదువుకున్నా. అనంతరం మద్నూర్ గురుకులంలో సీటు వచ్చింది. ఇంటర్ నారాయణ కాలేజీలో చదివాను. ఏఐట్రిపుల్ఈలో మంచి ర్యాంకు రావడంతో కాలికట్ ఎన్ఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. హెచ్ఎండబ్లూఎస్లో టీఎస్పీఎస్సీ ద్వారా 2015లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. అన్నయ్య ప్రోత్సాహంతో ఐప్లెచేసి పరీక్ష రాశాను. 2016లో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఎస్సారెస్పీలోని జెన్కోలో ఏఈగా పనిచేస్తున్నా.
– బొమ్మెన దేవరాజ్, ఏఈ, జెన్కో