Paytm | ప్రముఖ ఆన్లైన్ ఫైనాన్సియల్ పేమెంట్స్ సంస్థ పేటీఎంకు మరోమారు గట్టి షాక్ తగిలింది. ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు వెంటవెంటనే రాజీనామా చేసినట్లు సమాచారం. రెండేండ్లుగా పలువురు సీనియర్ ఉద్యోగులు సంస్థను వీడుతున్నారు. గురువారం రాజీనామా చేసిన వారిలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) అభిషేక్ అరుణ్, ఆఫ్లైన్ పేమెంట్స్ సీవోవో రేణు సాతి, సీనియర్ వైస్-ప్రెసిడెంట్, సీవోవో అభిషేక్ గుప్తా ఉన్నారని వార్తలొచ్చాయి.
పదేండ్లకు పైగా పేటీఎంలో సేవలు అందిస్తున్న అభిషేక్ అరుణ్ కంపెనీ నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొంటూ లింక్డ్ఇన్ పోస్ట్ చేశారు. అభిషేక్ గుప్తా, రేణు సాతి గతేడాదే పేటీఎంలో చేరగా.. ఇటీవల వీరిద్దరూ తమ రాజీనామాలు సమర్పించారని సమాచారం. సీనియర్ ఎగ్జిక్యూటివ్ల రాజీనామాలపై పేటీఎం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు వైదొగారు.