అమరావతి : నైరుతి పవనాల ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసాయి. శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందగా బాపట్లలో ఇంటిపై పిడుగు పడి బాలిక మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం చిగురువలసలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు. పొలంలో పనులు చేస్తుండగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో వీరిపై పిడుగుపడింది. రైతులు పద్మనాభం, గోవిందరావు అక్కడికక్కడే మృతి చెందగా వీరితో కలిసి పనిచేస్తున్న లక్ష్మణ్ అస్వస్థతకు గురికావడంతో శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు.
ఏపీలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధాన వీధూలైన గాంధీరోడ్డు, రాజీవ్ కూడలి, కొర్రపాడు రోడ్డు, జిన్నా రోడ్డుతో పాటు పలు కాలనీలు నీటితో నిండిపోయాయి. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా చిరుజల్లులు కురిసాయి. బాపట్ల జిల్లాలో పలుచోట్ల వర్షం బీభత్సం సృష్టించింది. బాపట్ల, చీరాల, పర్చూరు, మార్టూరు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. కిశోర్ కాలనీలో ఓ ఇంటిపై పిడుగు పడి 8 ఏళ్ల బాలిక మృతిచెందింది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఓర్వకల్లు మండలం నన్నూరు వద్ద భారీ వర్షాలకు వంతెన తెగి రాకపోకలు నిలిచిపోయాయి. బేతంచర్ల మండలం ఎంబాయి వద్ద వరద నీటిలో కొట్టుకుపోతున్న కారును స్థానికులు రక్షించారు.