మాజీ మంత్రి రావెలకు జాతీయ స్థాయి బాధ్యత వారి నాయకత్వ లక్షణాలను ప్రశంసించిన కేసీఆర్ భారీగా బీఆర్ఎస్లో చేరిన ఆంధ్రప్రదేశ్ నాయకులు తెలంగాణ భవన్లో రోజంతా జోరుగా సంబురాలు జై కేసీఆర్ నినాదాలతో మార్మోగిన సభా మందిరం కేరింతలు, చప్పట్లతో ముఖ్యమంత్రికి సంఘీభావం ఏపీలో అచ్చమైన ప్రజా రాజకీయాలు రావాలె బీఆర్ఎస్కు ఏపీలో అపూర్వ ఆదరణ లభిస్తున్నది చేరేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేల ఉత్సాహం: కేసీఆర్
హైదరాబాద్,జనవరి 2 (నమస్తే తెలంగాణ) : భారత రాష్ట్ర సమితి ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ను పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. సోమవారం హైదరాబాద్ తెలంగాణభవన్లో ఏపీ నేతలు పలువురు బీఆర్ఎస్లో చేరగా, ఆ కార్యక్రమంలోనే చంద్రశేఖర్ నియామకాన్ని కేసీఆర్ ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిశోర్బాబు ఢిల్లీ కేంద్రంగా జాతీయస్థాయిలో పనిచేస్తారని ఆయన వెల్లడించారు. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి అభ్యర్థి రావెల కిశోర్బాబు, మాజీ ఐఆర్ఎస్
మొదటిపేజీ తరువాయి…
అధికారి చింతల పార్థసారథి తదితరులు వందలాదిమంది అనుచరులతో కలిసి వచ్చి సోమవారం బీఆర్ఎస్లో చేరారు. భారీ కాన్వాయ్తో వచ్చిన ఏపీ నేతలకు తెలంగాణ భవన్ వద్ద గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. బీఆర్ఎస్లో చేరేందుకు వచ్చిన నేతలతో తెలంగాణభవన్ కోలాహలంగా మారింది. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల సాంస్కృతిక కళా ప్రదర్శనలతో పండుగ వాతావరణం నెలకొన్నది. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పార్టీ నేత దాసోజు శ్రవణ్ తదితరులు ఏపీ నేతలకు స్వాగతం పలికారు.
వజ్రాల వంటి నాయకులు దొరికారు..
ఏపీ నుంచి వజ్రాల వంటి విద్యావంతులు, యువకులు బీఆర్ఎస్లో చేరారని సీఎం కేసీఆర్ అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి అభ్యర్థి రావెల కిశోర్బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి తదితరులకు గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన అధినేత కేసీఆర్.. ఈ సందర్భంగా సభావేదికపైనే కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర శాఖ సారథ్య బాధ్యతలను మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్కు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ‘వైకుంఠ ఏకాదశి మంచి పర్వదినం రోజున ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను నియమిస్తున్నా. నా మాట గౌరవించి బాధ్యతలు స్వీకరించాలి. చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా సంపూర్ణ విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది’ అని కేసీఆర్ చెప్పారు.
కిశోర్ జాతీయస్థాయిలో పనిచేస్తారు
మాజీ మంత్రి రావెల కిశోర్బాబు ఢిల్లీ కేంద్రంగా జాతీయస్థాయిలో బీఆర్ఎస్ కోసం పనిచేస్తారని అధినేత కేసీఆర్ ప్రకటించారు. చాలాకాలం కాన్షీరాంతో కలిసి జాతీయస్థాయిలో పనిచేశారని, దళితుల సమస్యలపై అధ్యయనం చేశారని కేసీఆర్ చెప్పారు. దేశంలో దళిత జాతి ఉద్ధరణకు కిశోర్బాబు తనతో కలిసి సేవలు అందిస్తారని తెలిపారు. ‘తోట చంద్రశేఖర్, రావెల కిశోర్బాబు తదితరులతో చాలా గంటలు మాట్లాడుకున్నాం. బీఆర్ఎస్ కోసం ఒక పంథా వేసుకున్నాం. ఆ దిశగా పురోగమించేందుకు జాతీయస్థాయిలో కిశోర్బాబు పనిచేస్తారు. ఏపీలో పార్టీ బరువు, బాధ్యత చంద్రశేఖర్పై ఉంటుంది. వారికి పరిపాలన అనుభవం ఉంది. అవకాశం కలిగింది. ఇక తడాఖా చూపించడమే తరువాయి. రావెల కిశోర్ జాతీయ స్థాయిలో పనిచేయాల్సిన వ్యక్తి. పార్థసారథి సేవలు కూడా ఉపయోగించుకుంటాం. రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు నిర్వహించుకుందాం. బీఆర్ఎస్ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యచరణ రూపొందించుకుని ముందుకు సాగుదాం’ అని కేసీఆర్ చెప్పారు. సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు పెరుగుతాయని కేసీఆర్ తెలిపారు.
తరలివచ్చిన ఏపీ నేతలు
బీఆర్ఎస్లో చేరేందుకు ఏపీ నలుమూల నుంచి నేతలు హైదరాబాద్కు తరలివచ్చారు. గుంటూరు, తూర్పు గోదావరి, కర్నూల్, అనంతపురం తదితర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వచ్చారు. రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్, అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేసిన చింతల పార్థసారథి బీఆర్ఎస్లో చేరారు. వారితోపాటు టీజే ప్రకాశ్ (అనంతపురం సీనియర్ నేత), తాడిపాక రమేశ్నాయుడు (కాపునాడు జాతీయ అధ్యక్షుడు), గిద్దల శ్రీనివాస్నాయుడు (కాపునాడు ప్రధాన కార్యదర్శి), జేటీ రామారావు (ఆంధ్రప్రదేశ్ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు), రాధాకృష్ణ, బంగార్రాజు (ముమ్మిడివరం), శ్రీనివాసయాలు (కొత్తపేట), జీ శ్రీనివాసునాయుడు (అవిడి), వెంకటేశ్వర్రావు (గురిజాల), వంశీకృష్ణ, సతీశ్కుమార్ (నూజివీడు), ఉంజనేని అశోక్, యూ ఫణికుమార్ (గుడివాడ), తోటకూర కోటేశ్, నయీం ఉల్ ముల్క్ (నందిగామ), భారతి (మంగళగిరి) ఆధ్వర్యంలో వందలాది మంది బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ కేసీఆర్ గులాబీ కండువాలు కప్పారు.
కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బిగాల గణేశ్గుప్తా, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవరెడ్డి, వై సతీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.