హైదరాబాద్ : బిజెపి, కాంగ్రెసు నాయకులు తెలంగాణకు శని మాదిరిగా దాపురించారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు జాతీయ పార్టీలకు చెందిన నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్,రాజా సింగ్,రేవంత్ రెడ్డిలు నోటికొచ్చినట్టు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుండడం శోచనీయమన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ ఉద్దేశించి కిషన్ రెడ్డి, సంజయ్, రేవంత్ లు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీళ్ల మాటలతో రాష్ట్రంలో నెలకొన్న శాంతి, సామరస్యాలు దెబ్బతీసేవిగా ఉన్నాయన్నారు.
తమ వ్యాఖ్యల్ని వాళ్లు వెంటనే వెనక్కి తీసుకోవాలి. రెండు చెంపలేసుకుని కేసీఆర్కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మంత్రి కొప్పుల డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్లకు దేహశుద్ధి చేయడం ఖాయమని హెచ్చరించారు.