ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 17: రాష్ట్ర పునర్విభజన సమయంలో భద్రాచలం సమీపంలోని ఐదు పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్లాయని, వాటిని తెలంగాణలో కలపాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి విద్యార్థి నాయకులు, మేధావులతో ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఓయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి, తెలంగాణ రాష్ట్ర బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నగేశ్, తెలంగాణ బంజారా భేరీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భరత్నాయక్, జాతీయ అనుసూచిత సంఘం కార్యదర్శి నాగరాజు, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్, వివిధ సంఘాల నాయకులు వేణు, వాసు, వెంకట్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో భౌగోళికంగా తెలంగాణలో ఉన్న ఐదు పంచాయతీలను పరిపాలన రీత్యా ఏపీలో కలిపారని, అయితే అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా విభజన సమస్యలపై చర్చిస్తున్న కేంద్రం ఈ సమస్యను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు.