Yadadri Temple | ఇలవైకుంఠంగా అలరారుతున్న యాదాద్రిలో ఎన్నో ప్రత్యేకతలు. ఈ దివ్యక్షేత్రంలో ప్రతి రేణువూ పరమాత్మ స్వరూపమే! మనసు రిక్కించి వినాలే కానీ, ఇక్కడి కొండగాలిలోసింహనాదం మెండుగా ప్రతిధ్వనిస్తుంది. ఈ కొండపై నిండుకుండలా తొణికిసలాడే విష్ణు పుష్కరిణి అచ్చంగా సురగంగా జలంతో దివ్యత్వాన్ని పొందింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొత్త శోభను సంతరించుకుంది. దీనికి అనుబంధంగా కొండ కింద భక్తుల పుణ్యస్నానాల కోసం విశాలమైన ‘లక్ష్మీ పుష్కరిణి’ నిర్మించారు. ఈ దివ్య పుష్కరిణుల విశేషాలు ఇవి..
ఏదైనా క్షేత్ర సందర్శనకు వెళ్లినప్పుడు భక్తులు అక్కడి పుణ్యతీర్థంలో స్నానం ఆచరిస్తారు. నదీతీరం లేని క్షేత్రాల్లో ఆ లోటును పుష్కరిణులు తీరుస్తాయి. స్థల పురాణానికి సరితూగే దివ్యత్వం పవిత్ర పుష్కరిణుల సొంతం. యాదాద్రిపై ఉన్న విష్ణు పుష్కరిణి ఇలాంటిదే. కొండపై నరసింహుడు ఆవిర్భవించిన సుముహూర్తంలోనే పుష్కరిణి కూడా వెలిసిందని ఐతిహ్యం. కొండపై ఈశాన్య ప్రాంతంలో విష్ణు పుష్కరిణి దర్శమిస్తుంది. విష్ణుమూర్తి పాదాల నుంచి ఉద్భవించిన సుర గంగ, శివుడి జటాజూటం చేరి, అక్కడి నుంచి హిమగిరిపై దూకి, పుడమిని పులకరింపజేసి, సగర పుత్రులకు సద్గతిని ప్రసాదించి, దండకారణ్యంలోని యాదవ పర్వతం చేరుకుందని స్థల పురాణం. అలా సురగంగా జలాలతో పునీతమైన విష్ణు పుష్కరిణి యాదాద్రి వైభవంలో పాలుపంచుకుంటున్నది.
విష్ణు పుష్కరిణి ఆవిర్భావం వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. వైకుంఠంలో విష్ణుమూర్తి స్నానం ఆచరించే తీర్థం విరజానది. ఆ పుణ్యనది జలాలు బ్రహ్మదేవుడి కమండలం చేరి, అందులో నుంచి యాదాద్రి కొండపైకి జాలువారి పుష్కరిణిగా అవతరించిందని చెబుతారు. విష్ణుమూర్తి స్నానం చేసే విరజానది జలాలు కావడంతో, దీనిని ‘విష్ణు పుష్కరిణి’ అని పిలుస్తారు. ఈ పుష్కరిణిలోని పుణ్య జలాలనే స్వామివారి పూజలకు వినియోగిస్తారు. బ్రాహ్మీ ముహూర్త సమయంలో అర్చకులు పుష్కరిణి నుంచి సశాస్త్రీయంగా జలాలను సేకరించి, స్వామి సేవకు ఉపయోగిస్తారు. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా విష్ణు పుష్కరిణిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొండపై చూడదలచిన ఎన్నో దర్శనీయ ప్రాంతాల్లో ఇదీ ఒకటి.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భక్తుల కోసం యాదాద్రిలో మరో పుష్కరిణిని సిద్ధం చేశారు. యాదాద్రి దిగువ భాగంలో గండి చెరువు దగ్గర లక్ష్మీ పుష్కరిణిని నిర్మించారు. 2.47 ఎకరాల స్థలంలో సుమారు 43 మీటర్ల పొడవు, 16.50 మీటర్ల వెడల్పు, 4 అడుగుల లోతుతో నిర్మించిన గుండంలో 15 లక్షల లీటర్ల నీటిని నిల్వ ఉంచుతారు. సుమారు 1,500 మంది భక్తులు ఏకకాలంలో లక్ష్మీ పుష్కరిణిలో స్నానం చేయవచ్చు. గుండం చుట్టూ భక్తులు వెళ్లేందుకు వీలుగా స్టీల్ గ్రిల్స్ ఏర్పాటుచేశారు. భక్తులు స్నానానికి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ప్రత్యేకంగా గ్రిల్స్ బిగించారు. స్నానం చేసిన భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు నిర్మించారు. పుష్కరిణి చెంతనే 20 లక్షల లీటర్లు నిల్వచేసే నీటి సంపును నిర్మించారు. సంపులోంచి నీటిని ప్రత్యేకమైన పైపులైన్ ద్వారా 4 ఫిల్టర్లకు విడుదల చేసి శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన నీళ్లను మోటారు పైపులైన్ల ద్వారా గుండంలోకి విడుదల చేస్తారు. మెట్లు, మంటపాలకు బిగించిన 300 నల్లాల నుంచి గుండంలోకి నీళ్లు వెళ్తాయి.
కల్యాణకట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తులతోపాటు ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తుల తలనీలాలు, ఇతర వ్యర్థాలు గుండంలో కలవకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేశారు. మెట్లకు బిగించిన డ్రెయిన్ల ద్వారా వ్యర్థాలన్నీ బ్యాలెన్సింగ్ ట్యాంక్కి తరలిస్తారు. వాటిని తొలగించి నీటిని ఫిల్టర్లకు పంపిస్తారు. అక్కడ శుద్ధి అయిన జలాలు తిరిగి గుండంలోకి వచ్చేలా ఏర్పాటుచేశారు. ఇలా అధునాతన సౌకర్యాలతో యాదాద్రిలో గుండాలను తీర్చిదిద్దారు.