Telangana | ఎట్లున్న రాష్ట్రం.. ఎట్లయ్యింది? నిన్నటి గతుకుల ఇరుకు రోడ్లు.. నేడు నునుపుగా పెద్దగైనయ్. నిన్న భూత్ బంగళాల్లా కనిపించిన ప్రభుత్వ భవనాలు.. నేడు కార్పొరేట్ ఆఫీసులనే తలదన్నుతున్నయ్. అంతేనా.. రాజసాన్ని ఒలకబోస్తున్న సెక్రటేరియట్ ఒకవైపు.. తెలంగాణ అమర వీరుల స్మారకం మరోవైపు.. ఆకాశాన్ని ముద్దాడుతున్న అంబేద్కర్ విగ్రహం ఇంకోవైపు.. నేరాలపై డేగకన్ను పెట్టే బహుళ ప్రయోజనాల కమాండ్ కంట్రోల్ సెంటర్ వేరొకవైపు ఇలా.. ఒకటా రెండా.. తొమ్మిదిన్నరేండ్ల కలల తెలంగాణ పునర్ నిర్మాణంలో అభివృద్ధిని కండ్లకు కట్టిండ్రు!
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాతీయ రహదారుల విస్తీర్ణం సైతం తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వం రహదారుల పరిస్థితిని మెరుగుపర్చడం ద్వారా తెలంగాణలో ప్రగతికి బాటలు నిర్మించింది. రహదారుల అభివృద్ధిని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించి దశలవారీగా అభివృద్ధి చేసింది. గ్రామాల్లోని రోడ్లతోపాటు మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి రోడ్లను అభివృద్ధి చేశారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు వాటిని జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేశారు. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా, రెండు లేన్లను నాలుగు లేన్లు, ఆరు లేన్లుగా విస్తరించారు. ముఖ్యంగా గ్రామాల్లో పెద్దఎత్తున సీసీ రోడ్లను అభివృద్ధి చేశారు. ఫలితంగా రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ తదితర శాఖల పరిధిలో అన్ని రకాల రోడ్లు కలుపుకొని మొత్తం 1,09,260 కిలోమీటర్లకు చేరుకున్నాయి. ఇందులో సగానికిపైగా బ్లాక్టాప్ రోడ్లు ఉండగా, మిగిలినవి సీసీ, మెటల్ రోడ్లు.
అంబేద్కర్ సచివాలయం
ఉమ్మడి రాష్ట్రంలో అరకొర సౌకర్యాలతో ఉన్న సచివాలయ స్థానంలో ప్రభుత్వం రూ.617 కోట్ల వ్యయంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయా న్ని నిర్మించింది. 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం లో, 7 అంతస్తుల్లో గ్రీన్ బిల్డింగ్ విధానంలో నిర్మించగా, దీనికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ద్వారా గోల్డ్ రేటింగ్ లభించింది. ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల ముఖ్య అధికారులు ఒకేచోట ఉండేలా 28 ఎకరాల్లోని సువిశాల స్థలం లోని 7,79,982 చదరపు అడుగుల విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో ఈ భవనం నిర్మించారు. ఇంత ఎత్తయిన సచివాలయం ఏ రాష్ట్రంలోనూ లేదు. ఈ సచివాలయం భిన్న సంసృతుల సమ్మేళ నం. దేశంలోని అతిపెద్ద సచివాలయాల్లో ఇదొకటి. సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసర మైన విద్యుత్తును సోలార్ పద్ధతి లో ఉత్పత్తి చేస్తు న్నారు. పనులు మొదలయ్యాక 26 నెలల రికార్డు సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇంత భారీ నిర్మాణానికి సర్వ సాధారణంగా కనీసం ఐదేండ్ల సమయమైనా పడుతుంది.
తెలంగాణ అమర వీరుల స్మారక చిహ్నం
తెలంగాణ పోరాటంలో అసువులుబాసిన అమరుల గుర్తుగా రాష్ట్ర సచివాలయానికి ఎదురుగా లుంబినీ పారు సమీపంలో స్మారక చిహ్నాన్ని ప్రభుత్వం రూ.177.50 కోట్లతో నిర్మించింది. ఇందులో ఉద్యమ ఘట్టాలను వివరించే మ్యూజియం, సమావేశ మందిరం, రెస్టారెంట్ వంటి సౌకర్యాలున్నాయి. రాష్ర్టానికి దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథులు సందర్శించేలా ఈ స్మారక చిహ్నాన్ని తీర్చిదిద్దారు.
సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్
నేరాలపై నిఘాతోపాటు బహుళ ప్రయోజనాల కోసం ప్రభుత్వం బంజారాహిల్స్లో రూ.585 కోట్లతో సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించింది. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను దీనికి అనుసంధానం చేశారు. ప్రకృతి విపత్తులు, వరదలు సంభవించినప్పుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకునేందుకు సౌకర్యాలను కల్పించారు.
ఆర్అండ్బీ పునర్ వ్యవస్థీకరణ
రోడ్లు, భవనాల శాఖ సేవలను మరింత సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో ఆర్అండ్బీ శాఖను పునర్ వ్యవస్థీకరించారు. తాజాగా చీఫ్ ఇంజినీర్ ఆఫీస్తోపాటు సర్కిళ్లు, డివిజన్లు, సబ్-డివిజన్లు, సెక్షన్ ఆఫీసులను ఏర్పాటు చేశారు. మొత్తం పోస్టులు 3,371గా నిర్ధారించారు. ఇందులో ప్రస్తుతం ఉన్న పోస్టులు 2,961 పోస్టులు పోగా, కొత్తగా 472 పోస్టులను మంజూరు చేశారు. మూడు చీఫ్ ఇంజినీర్ పోస్టులు (రెండు సివిల్, ఒకటి ఎలక్ట్రికల్), పది సివిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్, రెండు ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ తదితర పోస్టులను ఖరారు చేశారు. నూతన కార్యాలయాల ఏర్పాటుతో ఈ శాఖలో పరిపాలన వికేంద్రీకరణ జరిగి, నూతన రహదారుల నిర్మాణం, రహదారుల మరమ్మతులు, ప్రజలకు సత్వర సేవలు అందించే ప్రభుత్వ కార్యాలయాలు, నర్సింగ్, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ దవాఖానల నిర్మాణం వేగిరమయ్యే అవకాశమున్నది.
ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రూ.146.50 కోట్ల వ్యయంతో 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మించింది. హుస్సేన్సాగర్ తీరాన, సచివాలయం పక్కనే పార్లమెంటు రూపంలో ఉన్న 55 అడుగుల అతిపెద్ద నిర్మాణంపై ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. ఇందులో అంబేద్కర్ జీవిత విశేషాలను వివరించే మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని అంబేద్కర్ విగ్రహాల్లో ఇదే అతి ఎత్తయినది.
రీజినల్ రింగ్ రోడ్
హైదరాబాద్లో ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్కు అదనంగా రీజినల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, జిల్లాల నుంచి హైదరాబాద్కు మెరుగైన రవాణా సౌకర్యం సాధ్యమవుతుంది. ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్కు 30 కిలోమీటర్ల దూరంలో 340 కిలోమీటర్ల పొడవున రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపడుతుండగా, ఈ రోడ్డు నిర్మాణం తెలంగాణ అభివృద్ధికి కొత్త ఊపునిస్తుంది. భూసేకరణ కోసం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది.
అనీస్-ఉల్-గుర్బా
అనాథలైన ముస్లిం మైనారిటీ బాలురు, బాలికల కోసం ప్రభుత్వం రూ.39 కోట్లతో నాంపల్లిలో అనీస్-ఉల్-గుర్బా పేరుతో ఓ అనాథ శరణాల యాన్ని నిర్మించింది. ఇందులో ఆఫీసుతోపాటు బాలురు, బాలికలకు విడివిడిగా వసతి గృహాలను నిర్మించారు.
ఎమ్మెల్యేల నివాస-కార్యాలయ భవనాలు
ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు రూ.139 కోట్లతో రెసిడెన్స్ కమ్ ఆఫీస్ భవనాలు నిర్మించారు. 112 భవనాలు మంజూరు కాగా, అందులో 95 ఇప్పటికే పూర్తయ్యాయి. మిగతావి పురోగతిలో ఉన్నాయి. ఇప్పటివరకు రూ.110.10 కోట్లు ఖర్చయ్యాయి.
సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం
రాష్ట్రంలో 33 జిల్లాలకుగాను 30 జిల్లాల్లో రూ.1,649.62 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ (ఐడీఐసీ)ల నిర్మాణం చేపట్టారు. ఇందులో ఇప్పటివరకు 1,058.04 కోట్ల పనులు పూర్తయ్యాయి. 25 కలెక్టరేట్ భవనాలను ప్రారంభించారు. ప్రజాసేవలు త్వరిత గతిన, అన్ని సేవలూ ఒకే కాంప్లెక్స్ భవనంలో లభించేలా వీటిని డిజైన్ చేయడం విశేషం. హైద రాబాద్, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల కలెక్టరేట్ భవనాలు ఇదివరకే ఉండగా, మిగతా 30 జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో సిద్దిపేట, కామారెడ్డి, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జన గామ, యాదాద్రి భువనగిరి, వనపర్తి, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్నగర్, జగిత్యాల, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, జోగుళాంబ గద్వాల, కుమ్రం భీం ఆసిఫా బాద్, నాగర్కర్నూల్, సూర్యాపేట, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, కరీంనగర్ కలెక్టరేట్లు కొత్తవి.
అత్యాధునికంగా నిమ్స్, 4 సూపర్ స్పెషాలిటీ దవాఖానలు…
ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని చేరువ చేసేందుకు ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ దవాఖానలు, వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉండేవి. సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ సంకల్పంతో మొత్తంగా తొమ్మిదేండ్లలో 21 మెడికల్ కాలేజీల ప్రారంభంతో వీటి సంఖ్య 26కు చేరింది. హైదరాబాద్లో మూడు, వరంగల్లో ఒకటి కలుపుకొని మొత్తం నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం చేపట్టారు. రూ.3,779 కోట్లతో పనులు చేపట్టగా, పనులు వివిధ దశల్లో ఉన్నాయి. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)ను రూ.1,571 కోట్ల వ్యయంతో అత్యాధునిక పద్ధతుల్లో విశాలంగా నిర్మిస్తున్నది.
అధికారుల క్వార్టర్లు ఇలా…
కలెక్టరేట్లతోపాటు కలెక్టర్ బంగళా, జాయిం ట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర జిల్లా అధికారుల క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి.
బంగళా 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+1గా డిజైన్ చేశారు. మూడు బెడ్రూమ్లు, నాలుగు టాయ్లెట్లు, డ్రాయింగ్, లివింగ్, డైనింగ్, కిచెన్, స్టోర్, ప్రేయర్ రూమ్, యుటిలిటీ తదితర గదులు, వరండా, గార్డెన్, ఆఫీస్ రూమ్, స్టాఫ్ హాల్, విజిటర్స్ వెయిటింగ్, కాన్ఫరెన్స్ హాల్ నిర్మిస్తున్నారు.
కలెక్టర్ బంగళా 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+1గా ఉంటుంది. మూడు పడక గదులు, ఇతర రూములతో ఏర్పాట్లు చేశారు.
క్వార్టర్స్ 2,130 చదరపు అడుగుల విస్తీర్ణంలో, జిల్లాస్థాయి అధికారుల నివాస క్వార్టర్స్ను 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో డిజైన్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణ విశేషాలు
☞ ఆర్అండ్బీ ప్రస్తుతం 32,717 కిలోమీటర్ల పొడవున రోడ్లను నిర్వహిస్తున్నది. దీంట్లో 27,734 కి.మీ. స్టేట్ రోడ్లు కాగా, 4,983 కి.మీ. జాతీయ రహదారులు.
☞రాష్ట్రం ఏర్పడే నాటికి ఆర్అండ్బీ రోడ్ల పొడవు 24,245 కిలోమీటర్లు మాత్రమే.
☞ ఇందులో కేవలం 27.9 శాతమే. రెండు లేన్లు, అంతకంటే ఎక్కువ వెడల్పయినవి.
☞ రూ.17,360 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 10,585 కిలోమీటర్ల మేర సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా, నాలుగు లేన్ల రోడ్లుగా, ఆరు లేన్ల రోడ్లుగా అభివృద్ధి చేసే పనులు చేపట్టారు.
☞ ఇందులో 8,578 (ఇందులో 8,218 కిలోమీటర్ల డబుల్ లేన్ రోడ్లు, 321 కిలోమీటర్ల నాలుగు లేన్ల రోడ్లు, 39 కిలోమీటర్ల్ల ఆరు లేన్ల రోడ్లు) కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.
☞ తొమ్మిదేండ్లలో 8,218 కిలోమీటర్ల మేర రెండు లేన్ల రోడ్ల నిర్మాణం పూర్తిచేయగా, ఇది గతంలో 56 సంవత్సరాల్లో నిర్మించిన రెండు లేన్ల రోడ్లకన్నా అధికం కావడం విశేషం.
☞ జిల్లాల పునర్విభజనకు ముందు 459 మండలాల్లో 145 మండలాలకు జిల్లా కేంద్రాల నుంచి డబుల్ లేన్ రోడ్ల సౌకర్యం లేదు. దీంతో మండలాలను జిల్లా కేంద్రాలకు కలిపేలా రూ.2,727 కోట్లతో 1,875 కిలోమీటర్ల పొడవున డబుల్ లేన్ రోడ్ల నిర్మాణం చేపట్టారు.
☞ ఇందులో ఇప్పటివరకు 1,685 కిలోమీటర్ల పొడవున పనులు పూర్తయ్యాయి.
☞ వివిధ ఆలయాలు, ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లను కలిపే మేజర్ రోడ్లు, జిల్లా రోడ్ల విస్తరణ రూ.11,191 కోట్లతో చేపట్టారు. ఇందులో 5,649 కిలోమీటర్ల మేర పనులు చేపట్టగా, అందులో 4,517 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.
☞ సెంట్రల్ రోడ్ ఫండ్ (సీఆర్ఎఫ్) కింద రూ.3,442 కోట్లతో మరో 33,061 కి.మీ. మేర రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టారు. రూ.2,187 కోట్ల విలువైన 2,377 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి.
☞ రూ.3,134 కోట్లతో 717 బ్రిడ్జిల పునరుద్ధరణ, విస్తరణ పనులు చేపట్టగా, అందులో 382 బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యింది.
☞ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రూ.4,603 కోట్లతో 13,000 కిలోమీటర్ల మేర రోడ్ల పునరుద్ధరణ పనులు పూర్తిచేయగా, మరో రూ.2,407 కోట్లతో 6,000 కిలోమీటర్ల పునరుద్ధరణ పనులు పురోగతిలో ఉన్నాయి.
☞ 184 బ్రిడ్జ్ కమ్ చెక్డ్యాంల నిర్మాణం చేపట్టగా, 141 పూర్తయ్యాయి.
☞ రూ.865 కోట్లతో 28 రైల్వే క్రాసింగ్ల వద్ద ఆర్వోబీలు/ఆర్యూబీల నిర్మాణం పూర్తిచేశారు.F తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో రైల్వే క్రాసింగ్ల వద్ద మొత్తం ఆర్వోబీలు/ఆర్యూబీలు 32 మాత్రమే ఉండగా, గడిచిన తొమ్మిదేండ్లలో 28 నిర్మించడం విశేషం.
☞ తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 2,511 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులు ఉండగా, ఆ తర్వాత కొత్తగా 2,472 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారులను నిర్మించారు. దీంతో జాతీయ రహదారుల విస్తీర్ణం 4,983 కిలోమీటర్లకు పెరిగింది.