కీవ్, ఫిబ్రవరి 28: ఉక్రెయిన్పై దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసింది. సోమవారం శాంతి చర్చలు ముగిసిన తర్వాత ఖార్కీవ్ నగరంపై క్లస్టర్ బాంబులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ సైన్యం ఉన్న ప్రాంతాలతో పాటు జనావాసాలపైనా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఖార్కీవ్లోనే పదుల సంఖ్యలో పౌరులు మరణించారు. వందల మంది గాయపడ్డారు. రాజధాని కీవ్ నగరంపై పట్టు కోసం రష్యా సైనిక చర్యను ఉద్ధృతం చేసింది. నగరం నలువైపుల నుంచి మరిన్ని బలగాలు దూసుకువస్తున్నాయి. కర్ఫ్యూ సడలించడంతో కీవ్లో ప్రజలు ఆహార పదార్థాలు, నిత్యావసరాల కోసం మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఎదుట క్యూ కట్టారు.
రష్యా క్లస్టర్ బాంబులను ప్రయోగించవచ్చని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హెచ్చరించిన కొద్ది సేపటికే ఖార్కీవ్ నగరంపై దాడులు ప్రారంభమయ్యాయి. శుక్రవారమే రష్యా క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఆమ్నెస్టీ తాజాగా ఆరోపించింది. రష్యా ఖార్కీవ్పై బీఎం-21 మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ను ఉయోగించినట్టు తెలుస్తున్నది. అంతర్జాతీయ నియమాల ప్రకారం అణ్వాయుధాలపై నిషేధం ఉన్నట్టే క్లస్టర్ బాంబులపైనా నిషేధం ఉంది. సామా న్య పౌరులపై వీటిని ప్రయోగిస్తే యుద్ధ నేరాలకు పాల్పడినట్టే. కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్ కింద.. వందకు పైగా దేశాలు ఈ క్లస్టర్ బాంబులపై నిషేధం విధించాయి. వాటిని వాడబోమని ప్రతిజ్ఞ చేశాయి. అయితే, ఈ ఒప్పందంపై రష్యా, ఉక్రెయిన్ సంతకాలు చేయలేదు.
క్లస్టర్ బాంబు అంటే ఒక రాకెట్లో వందలాది బాంబులను ఉంచి ఒకేసారి ప్రయోగించడం. నిర్దిష్ట లక్ష్యాన్ని కాకుండా ఏదైనా ప్రాంతంపై దాడులు చేయాలనుకొన్నప్పుడు వీటిని వాడతారు. అలా ప్రయోగించినప్పుడు ఆ ప్రాంతమంతా బాంబులు చెల్లాచెదురుగా పడి భారీ విధ్వంసం జరుగుతుంది. ఈ ప్రక్రియనే ‘కార్పెట్ బాంబింగ్’ అని కూడా పిలుస్తారు.
ఉక్రెయిన్కు యుద్ధ విమానాలను అందజేయనున్నట్టు ఐరోపా సమాఖ్య ప్రకటించింది. నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఫోన్ చేశారు. ఉక్రెయిన్కు అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. ఇదిలా ఉండగా, తనను చంపడానికి రష్యా కిరాయి సైనికులను పంపిందని జెలెన్స్కీ ఆరోపించారు.
తమ దేశాన్ని ఐరోపా సమాఖ్య (ఈయూ)లో చేర్చుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దరఖాస్తు చేసుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఈయూలో చేరేందుకు సిద్ధమయ్యారు.
కీవ్: ఘర్షణల నేపథ్యంలో బెలారస్ సరిహద్దుల్లో ఉక్రెయిన్-రష్యా ప్రతినిధుల మధ్య సోమవారం నాలుగు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. చర్చలో భాగంగా ఆయా దేశాలు లేవనెత్తిన డిమాండ్లపై ఇరుపక్షాలు అంగీకారానికి రాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో పోలిష్-బెలారసియన్ సరిహద్దులో త్వరలో మలివిడుత చర్చలు జరుపాలని ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయించారు. కాగా, సోమవారం జరిగిన భేటీలో కాల్పులు విరమించి తమ దేశం నుంచి రష్యా బలగాలు వెళ్లిపోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేయగా, నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరకూడదంటూ రష్యా డిమాండ్ చేసినట్టు సమాచారం. అయితే, దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉన్నది.
కీవ్: రష్యా యుద్ధ ట్యాంకులు ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతాలకు వెళ్లనీయకుండా వందలాది మంది ఉక్రెయిన్ పౌరులు వాటిని అడ్డుకొంటున్న వీడియో వైరల్గా మారింది. కోర్యుకొవ్కా పట్టణ శివారు ప్రాంతంలో ఈ దిగ్బంధనం చోటుచేసుకున్నది. ఉక్రెయిన్ బలగాలకు మార్గం క్లియర్ చేసేందుకు ఓ పౌరుడు రోడ్డుపై గుర్తించిన మందుపాతరను చేతితో తీసేసిన వీడియో మరొకటి వైరల్ అవుతున్నది.
బాంబుదాడులతో దేశమంతా దద్దరిల్లుతున్నది. ప్రజలంతా భయంతో పరుగులు తీస్తున్నరు. అంతటా టెన్షన్.. టెన్షన్. కానీ అదే ఉక్రెయిన్లో ఓ రైతు రష్యా సైనికులకు షాక్ ఇచ్చాడు. ఇంతకు ఏం చేశాడో తెలుసా.. పొలం దున్నడానికి ట్రాక్టర్తో వెళ్లి అదే ట్రాక్టర్కు రష్యా యుద్ధ ట్యాంకును తగిలించుకొని వెళ్లిపోయాడు. తన మృతృభూమిలోకి చొరబడిన రష్యా సేనలకు ఇదే తగిన గుణపాఠం అని అతను చెబుతున్నాడు.
రష్యా, ఉక్రెయిన్ జెండాలను కప్పుకొని మనసులను పంచుకుంటున్న ఈ ఇద్దరి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఫొటో 2019 నాటిది. అయితే ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ ఫొటో శాంతి సందేశాన్ని చాటుతున్నదని, మళ్లీ గత కలయికలా కలిసి మెలసి ఉండాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.