కోర్టు సూచనల మేరకు స్పీకర్ నడుచుకున్నా కన్ఫ్యూజన్ డ్రామా షురూ..
రాజకీయ లబ్ధికోసమే దొంగ దీక్షలంటూసోషల్ మీడియాలో ట్రోలింగ్
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): విషయం లేకున్నా విషం చిమ్మాలి.. ఏదీ చేతకాకపోతే చివరకు ప్రజలను గందరగోళానికి గురిచేయాలి. ఇదీ కమలం పార్టీ నాయకుల ఎత్తుగడ. అసెంబ్లీ సమావేశాలు అడ్డుకోవడం ద్వారా ప్రజల దృష్టిలో పడాలని వేసిన పాచిక పారకపోవడంతో ఇప్పుడు ఇంకో ఎత్తుగడ వేస్తున్నారు. సభ నుంచి తమను బయటికి పంపారని ప్రచారం చేసుకుంటే ఎంతోకొంత మైలేజీ వస్తుందని భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది. ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగలేదని తెలుసున్న బీజేపీ పెద్దలు ఇప్పుడు తీరిగ్గా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత దీక్షల పేరిట డ్రామాలకు తెరతీశారన్న ప్రచారం జరుగుతున్నది. గురువారం ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట దీక్ష చేయబోతున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రకటనపై నెటిజన్లు ట్రోలింగ్స్ మొదలు పెట్టారు. ఆ దీక్షలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, కేవలం వారి రాజకీయ భవిష్యత్తు పరిరక్షణ కోసమే ఈ డ్రామాలు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వీటికి బదులేదీ తొండి సంజయ్
తాము చేస్తే రూల్స్ ఫాలో అవుతున్నట్టు.. అవే నిబంధనలు వేరే పార్టీ పాటిస్తే మాత్రం ఏదో జరిగిపోయినట్టు గగ్గోలు పెట్టడం బీజేపీ తంతు. అసెంబ్లీలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు పథకం ప్రకారం బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లోకి దూసుకొచ్చి స్పీకర్ పోడియంవైపు వెళ్లడం స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఆ ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేశారు. తమను నిలదీసే పార్టీల పట్ల బీజేపీ వైఖరి ఎలా ఉంటుందో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇతర పార్టీల సభ్యులను సస్పెండ్ చేయడం బీజేపీ మార్క్ సభా వ్యవహారమే. 2021, నవంబర్ 29న రాజ్యసభలో 12 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. 2015లో రాజ్యసభలో 25 మంది ఎంపీలు, 2012లో రాజ్యసభలో 8 మందిని సస్పెండ్ చేశారు. ఫిబ్రవరి 26, 2001లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని చూశారనే కారణంతో హిమాచల్ అసెంబ్లీ నుంచి అక్కడి బీజేపీ ప్రభుత్వం ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది.
కోర్టు స్పష్టంగా చెప్పినా..
శాసనసభకు స్పీకరే సర్వాధికారి అని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర శాసనసభ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్కు హైకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సస్పెన్షన్ ఎత్తివేయాలని సభాపతికే విజ్ఞప్తి చేసుకోవాలని సూచించింది.