హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ అవార్డును నోటిఫై చేయాలంటూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలన్నీ అబద్ధమని, ఆ పిటిషన్ను తిరస్కరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏపీ వల్లే తెలంగాణకు నీటి వాటాలో అన్యాయం జరిగిందని పేర్కొంది. కృష్ణా జలాల పునఃపంపిణీపై ఎనిమిదేండ్ల క్రితం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించిన అవార్డును అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ కర్ణాటక ఇటీవల దాఖలు చేసిన ఇంటర్లొక్యుటరీ అప్లికేషన్(ఐఏ) పై సోమవారం జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక వాదనలపై అభ్యంతరాలను తెలియజేసింది. సముద్రంలో నీళ్లు వృథాగా కలుస్తున్నాయన్న కర్ణాటక వాదనను తెలంగాణ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ తోసిపుచ్చారు. శ్రీశైలం, నాగార్జునసాగర్కే నీళ్లు రానప్పుడు సముద్రంలో ఎలా కలుస్తాయని ప్రశ్నించారు. కృష్ణా ట్రిబ్యునల్-1 కేటాయించిన నీరే తెలంగాణకు రావడం లేదని, ఎగువన ఉన్న కర్ణాటక మొత్తం నీటిని గుప్పెట పడుతున్నదని వివరించారు.
75 శాతం నీటి డిపెండబులిటీపై కేటాయించిన నీటిలో గత 14 ఏండ్ల వినియోగానికి సంబంధించిన గణాంకాలను కర్ణాటక ఇవ్వడం లేదని ఆక్షేపించారు. వాదనలు వినిపించేందుకు తమకు నాలుగు గంటల సమయం కావాలని సుప్రీంకోర్టుకు వైద్యనాథన్ విజ్ఞప్తి చేశారు. ట్రిబ్యునల్కు సంబంధించిన పిటిషన్పై డిసెంబర్ 13 నుంచి విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టంచేసింది. ఇది చాలా క్లిష్టమైన సమస్య అని, కేంద్రం నుంచి నిర్మాణాత్మక సూచనలు రావాల్సి ఉన్నదని, కర్ణాటక వాదనపై కేంద్రం వైఖరి ఏమిటో తెలియాల్సి ఉన్నదని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం తెలుపుతూ అఫిడవిట్ను దాఖలు చేయాలని సాలిసిటర్ జనరల్ను ధర్మాసనం ఆదేశించింది. వచ్చే నెల 13 నుంచి ట్రిబ్యునల్కు సంబంధించిన పిటిషన్పై విచారణ కొనసాగిస్తామని, వాదనలకు సంబంధించిన అఫిడవిట్లను దాఖలు చేయాలని కృష్ణా బేసిన్లోని కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకూ సూచించింది. తెలంగాణ తరపున వాదనలు వినిపించేందుకు 40 నిమిషాల సమయమిస్తామని ధర్మాసనం హామీ ఇచ్చింది.