కొత్తపల్లి, జనవరి 16: రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున నలుగురు ఎంపీలున్నా తెలంగాణ అభివృద్ధికి ఒక్క పైసా తేలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ కేంద్రం డబ్బులు ఇస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలని మండిపడ్డారు.
కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో రూ.1.90 కోట్ల స్మార్ట్సిటీ నిధులతో ఆధునీకరించిన ఇండోర్ స్టేడియం, స్కేటింగ్ రింక్ను వారు ఆదివారం ప్రారంభించి, మాట్లాడారు. కరీంనగర్ జిల్లా అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం ఉన్నదని, ఐటీ టవర్, స్మార్ట్సిటీ హోదా, మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జీ ల నిర్మాణమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. హైదరాబాద్, వరంగల్కు మాత్రమే కేంద్రం స్మార్ట్సిటీ హోదా ఇస్తామని ప్రకటించగా.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదా తెచ్చారని గుర్తుచేశారు. స్మార్ట్సిటీ ద్వారా జరుగుతున్న పనుల్లో కేంద్రం వాటా 50 శాతం ఉంటే రాష్ట్రం వాటా 50 శాతం ఉన్నదని స్పష్టంచేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి పల్లె ప్రగతి నుంచి నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రకటించడం ఆనందంగా ఉన్నదన్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు.. ఇక్కడ జరిగిన అభివృద్ధిలో 10 శాతం మేర వారి ప్రాంతాల్లో చేశారో? లేదో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఆయా రాష్ర్టాల్లో ఎక్కడా 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా అందించడం లేదని పునరుద్ఘాటించారు.