జనగామ : మనిషి భవిష్యత్తును బంగారుమయం చేసేది బడి మాత్రమే. గుడి, మసీదు, చర్చి కన్నా బడి వల్ల సమాజం పురోగమిస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని చేపట్టిందని, దీంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
జిల్లాలోని పాలకుర్తిలో పాలకుర్తి, కొడకండ్ల మండలాలు, దేవరుప్పుల మండలం రామరాజుపల్లి గ్రామంలో దేవరుప్పుల మండలాలల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జడ్పిటిసి, ఎంపిటిసి, ఎస్ఎంసి చైర్మన్లకు, సర్పంచులకు ఎంఈఓ, తదితర అధికారులకు మన ఊరు-మన బడి కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ శివలింగయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోని గ్రామాల్లో ప్రజలు తాగు, సాగునీరు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు కరువై పట్టణాలకు వలసలు పోయే వారన్నారు.
వలసలు పోయి పేదవారు సైతం ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించుకుని ఆర్థికంగా నష్టపోయి.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నారు.నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆద్వర్యంలో సాగు, తాగునీరు, విద్యుత్ లాంటి సౌకర్యాలు మెరుగుపర్చి.. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాల అమలుతో వలసపోయినవారు స్వగ్రామాలకు తిరిగివచ్చి.. వ్యవసాయం చేస్తూ.. స్వగ్రామంలోనే ఉపాధి పొందుతున్నారని అన్నారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని, ఇక మంచి చదువుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి పాఠశాలలోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు. పాఠశాలల్లో ఫర్నిచర్, ప్రహరీ గోడ నిర్మాణాలు, భవనాల, ఆట స్థలాల అభివృద్ధి పనులు, తాగునీటి నల్లాలు, మధ్యాహ్న భోజనానికి ఏర్పాట్లు, గర్ల్స్ కు ప్రత్యేక కిట్లు, పాఠ్యపుస్తకాలు, స్కాలర్షిప్స్ , మొదలగు అన్ని అవకాశాలను, సౌకర్యాలను విద్యార్థులకు అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏదైనా సాధించవచ్చని అందుకు అందరినీ కలుపుకుని సీనియర్ సిటిజెన్స్, పూర్వ విద్యార్థులు, యువకులతో, గ్రామ, బస్తీ వాసులతో కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి పాఠశాలను అందరి సహకారంతో అభివృద్ధి చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే ఉమ్మడి వరంగల్ జల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిద్దేందుకు కృషి చేయాలని అన్నారు.