హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే మొదటి స్మార్ట్ కాలిక్యులేటర్ను టీ హబ్ వేదికగా ఆవిష్కరించారు. టుహ్యాండ్స్ స్మార్ట్ కాలిక్యులేటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ సోమవారం విడుదల చేశారు. ఔత్సాహికులైన నలుగురు యువ పారిశ్రామికవేత్తలు ప్రారంభించిన స్టార్టప్.. టుహ్యాండ్స్ స్మార్ట్ కాలిక్యులేటర్ తయారీకి టీ హబ్ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే డిజైన్ చేసి చెన్నైలో తయారుచేయగా, మార్కెట్లో విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జయేశ్రంజన్ మాట్లాడుతూ.. క్యాసియో, ఇతర చైనీస్ కాలిక్యులేటర్ విక్రేతల ఆధిపత్యంలో ఉన్న కాలిక్యులేటర్ మార్కెట్లో టీ హబ్ వేదికగా రూపొందిన స్మార్ట్ కాలిక్యులేటర్ కొత్త మార్కెట్ సృష్టించనున్నదని చెప్పారు. నలుగురు యువకుల ఆలోచన ఉత్పత్తిగా మారి త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నదని తెలిపారు. రూ.2,999కే దీనిని అక్టోబర్ 25న మార్కెట్లోకి తీసుకురాన్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీ హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ సీఐవో శాంతా తౌటం పాల్గొన్నారు.