మనిషి జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా క్యాన్సర్, మధుమేహం, గుండెపోటు, రక్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధులు అనేకం పెరుగుతున్నాయి. క్షయ, న్యూమోనియా, కలరా, టైఫాయిడ్, హెపటైటిస్, డెంగ్యూ, మలేరియా, అమీబియాసిస్ లాంటి వ్యాధులు కూడా తీవ్రంగా వ్యాపిస్తున్నాయి. కరోనా వంటి ఫ్లూ వ్యాధులకు అంతం లేకుండాపోవడం మానవాళి మనుగడకే ప్రశ్నార్థకమైంది.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.3 కోట్లకు పైగా మరణాలు ‘పర్యావరణ కారణాల’ వల్లనే సంభవిస్తున్నాయని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంచనా వేసింది. జనాభా పెరుగుదల, పరిశ్రమలు, వాహనాల వల్ల వచ్చే కాలుష్యం రకరకాల రోగాలకు కారణమవుతున్నది. మరోవైపు దేశంలో ఆకలి సమస్యతో వందలాది మంది మరణిస్తున్నారని ‘ది లాన్సెట్’ పత్రిక చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ‘ప్రపంచ ఆకలి సూచి-2022’లో 121 దేశాల్లో భారత్ 107వ స్థానంలో నిలవడమే దీనికి నిదర్శనం. ఆహారలేమి, పోషకాహార లోపం సమస్యలు నేడు అత్యంత ప్రమాదకరంగా మారాయి. స్త్రీలు, చిన్నపిల్లలు వీటి కారణంగా అనేక రోగాల బారిన పడుతున్నారు. అధిక జనాభా, పేదరికం, నిరుద్యోగ సమస్యలు దీనికి తోడవుతున్నాయి. మానవుడు రోజువారీ జీవితంలో భాగంగా శారీరక శ్రమకు దూరమవుతున్నాడు. తద్వారా అనేక వ్యాధుల బారిన పడుతున్నాడని వైద్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు.
పటిష్ఠమైన విద్య, వైద్యరంగాలు దేశాభివృద్ధికి మూలస్తంభం. వీటిని విస్మరిస్తే పురోగతి శూన్యం అనేది పాలకులు ఎంత త్వరగా తెలుసుకొంటే అంత మంచిది. కరోనా వంటి మహమ్మారితో యావత్ ప్రపంచం అల్లకల్లోలమైంది. లక్షలాది ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచదేశాల్లోని వైద్యరంగంలో ఉన్న డొల్లతనం బయటపడింది. కరోనా తర్వాత కూడా పేద, మధ్యతరగతి కుటుంబాల్లో అనేక మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. కాబట్టి ఆరోగ్య సమస్యలకు కారణాలను తెలుసుకుంటూ సరైన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మానవాళి తీవ్ర అనారోగ్య ముప్పును ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది.
‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ 1948 నుంచి ఏటా ఏప్రిల్ 7వ తేదీని ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’గా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఈ సంవత్సరం అందరికీ ఆరోగ్యం (Health for all) అనే ఇతివృత్తంతో 75 వసంతాల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం శుభపరిణామం.
‘ఈసురోమని మనుష్యులుంటే దేశమేగతి బాగుపడునోయ్’ అని గురజాడ అన్న మాటలు నేటికీ అక్షర సత్యం. కాబట్టి ప్రతి దేశం ఆరోగ్య సంక్షోభాన్ని నివారించడానికి సరైన ప్రణాళికతో ముందుకువెళ్లాలి. ముఖ్యంగా అధిక జనాభా గల భారతదేశంలో ఆరోగ్యం మీద స్పృహ మరింత పెరగాలి. దేశంలోని ప్రతి పౌరుడు నాణ్యతతో కూడిన ఉచిత వైద్య సేవలను పొందే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేయాలి. ప్రాథమిక, జిల్లా ఆరోగ్యకేంద్రాల్లో సరిపడా సిబ్బందిని, వైద్యులను నియమించాలి. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ప్రజల భాగస్వామ్యంతో కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. శిశు సంరక్షణ, గర్భిణీ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దేశవ్యాప్తంగా ఔషధరంగంలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకురావాలి. వైద్యం అనేది వ్యాపారం కాదు, సామాజిక బాధ్యత అనే స్పృహ ప్రతి వైద్యుడిలో ఉండాలి. అప్పుడే ఆరోగ్య భారత్ సంపూర్ణమవుతుంది.
‘ఈసురోమని మనుష్యులుంటే దేశమేగతి బాగుపడునోయ్’ అని గురజాడ అన్న మాటలు నేటికీ అక్షర సత్యం. కాబట్టి ప్రతి దేశం ఆరోగ్య సంక్షోభాన్ని నివారించడానికి సరైన ప్రణాళికతో ముందుకువెళ్లాలి. ముఖ్యంగా అధిక జనాభా గల భారతదేశంలో ఆరోగ్యం మీద స్పృహ మరింత పెరగాలి. దేశంలోని ప్రతి పౌరుడు నాణ్యతతో కూడిన వైద్య సేవలను ఉచితంగా పొందేవిధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేయాలి.
చిన్నపిల్లలు, మహిళల్లో ఎదురవుతున్న రక్తహీనత, పౌష్టికాహార సమస్యను పరిష్కరించడానికి ‘పోషణ్ అభియాన్’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం పటిష్ఠంగా అమలు చేయాలి. తెలంగాణలోని కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, బాలామృతం వంటి కార్యక్రమాలు పోషకాహార సమస్యకు మంచి పరిష్కారంగా ఉన్నాయి. ప్రతీ పౌరుడు ఆరోగ్య సేవలను పొందే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను రూపొందించాలి. అప్పుడే ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాల పెంపులను చేరుకోవటం సాధ్యమవుతుంది.
ఎస్.శ్యామల: 80085 39905
(వ్యాసకర్త: సామాజిక కార్యకర్త)