నిర్మల్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో బుధవారం ఆయన పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగకి ఆడబిడ్డలకు సారెలు పంపిణీ,రంజాన్, క్రిస్మస్ పండుగలకు దుస్తులు అందిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాకు ఆరు వేల గిఫ్ట్ ప్యాక్లు వచ్చాయని పేర్కొన్నారు.
నిర్మల్ కు 2000 ముధోల్ కు 2500, ఖానాపూర్ నియోజకవర్గానికి 1500 కేటాయించామని, నిర్మల్ కు అదనంగా1000 గిప్ట్ లు తెప్పించామని వివరించారు. మసీదుల వారీగా అర్హులైన కుటుంబాలను ఎంపిక చేసి కానుకలు అందిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 815 మసీదుల పరిధిలోని దాదాపు ఐదు లక్షలకు పైగా కుటుంబాలకు ప్రభుత్వం రంజాన్ కానుకలు అందిస్తుందన్నారు. అనంతరం ఆయన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయ లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్, ఆర్డీవో రమేష్,FSCS చైర్మన్ ధర్మజి రాజేందర్,ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మద తదితరులు ఉన్నారు.