ICJ | హైదరాబాద్, జనవరి 26 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడుతున్నదంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానం (ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)) శుక్రవారం కీలక ఆదేశాలిచ్చింది. గాజాలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపేయాలంటూ ఇజ్రాయెల్ను ఆదేశించింది. దీని కోసం అవసరమైన అన్ని చర్యలను వెంటనే చేపట్టాలని పేర్కొంది. గాజాలో జరిగిన దాడుల్లో గాయపడ్డ పౌరులకు మానవతా సాయాన్ని కొనసాగించేలా చూడాలని కూడా కోర్టు సూచించింది. తమ ఆదేశాలకు అనుగుణంగా తీసుకొన్న చర్యలపై నివేదికను నెలలోగా సమర్పించాలని ఇజ్రాయెల్ను ఆదేశించిన న్యాయస్థానం.. తమ పరిధి మేరకు మాత్రమే ఈ ఆదేశాలనిస్తున్నట్టు వెల్లడించింది. అయితే, కాల్పుల విరమణకు ఆదేశాలివ్వాలంటూ దక్షిణాఫ్రికా చేసిన విజ్ఞప్తిపై కోర్టు స్పందించలేదు.
గాజాలో ఇజ్రాయెల్ మానవ హననానికి పాల్పడుతున్నదంటూ దక్షిణాఫ్రికా ఐసీజేకు ఫిర్యాదు చేసింది. గాజాలో హమాస్పై ఇజ్రాయెల్ సైనిక చర్య భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారి తీస్తున్నదని, దానిని ఆపేందుకు మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థలు, అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను ఇజ్రాయెల్ పట్టించుకొన్న చరిత్ర లేదు. దక్షిణాఫ్రికా ఐసీజే గడప తొక్కడంపై ఇప్పటికే ఇజ్రాయెల్ స్పందించింది. ఈ ఫిర్యాదుకు లీగల్ ఫౌండేషన్ లేదని స్పష్టం చేసింది. రాజకీయ లబ్ధిలో భాగంగానే దక్షిణాఫ్రికా ఈ కేసు వేసిందని ఆరోపించింది. ఇలాంటి ఆరోపణలను ఆధారం చేసుకొని ఐసీజే ఇచ్చిన ఈ ఆదేశాలకు తాము కట్టుబడి ఉండబోమని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ను అంతమొందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
ఐసీజే ఆదేశిస్తే ఇజ్రాయెల్తో యుద్ధంలో కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని గురువారం హమాస్ ప్రకటించింది. అయితే, ఇజ్రాయెల్ సైన్యం కూడా దాన్ని అమలు చేయాలని షరతు విధించింది.
2022లో ఉక్రెయిన్-రష్యా మధ్య మొదలైన యుద్ధంపై కూడా ఐసీజే కీలక ఆదేశాలిచ్చింది. దాడులను వెంటనే నిలిపేయాల్సిందిగా రష్యాను ఆదేశించింది. అయితే, ఆ ఆదేశాలను రష్యా పట్టించుకోలేదు.
జెరూసలెంలో ఉండే అల్-అఖ్సాను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు. దీన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలన్నదే తమ లక్ష్యమని ఇప్పటికే హమాస్ ప్రకటించింది. అయితే, అల్-అఖ్సా ఇజ్రాయెల్ సేనల రక్షణ వలయంలో ఉన్నది.