ముంబై, మే 11: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వద్ద పాలసీదారులు క్లెయిం చేయని రూ. 21,336 కోట్ల మొత్తం ఉంది. రెండు మానవసహిత అంతరిక్షయాన ప్రాజెక్టులకు (గగన్యాన్) ఈ మొత్తం సరిపోతుంది. ఇస్రో ప్రతిపాదించిన తొలి గగన్యాన్ ప్రాజెక్టుకు అంచనా వ్యయం రూ. 10,000 కోట్లు. ఎల్ఐసీ వద్దనున్న అన్క్లైమ్డ్ సొమ్మును రెండు గగన్యాన్ ప్రాజెక్టులకు ఉపయోగించవచ్చు.
2021 డిసెంబర్ చివరికల్లా తమ వద్ద రూ. 21,336 కోట్ల క్లెయింకాని మొత్తం ఉందని సంస్థ తెలిపింది. గత పది సంవత్సరాల్లో ఎవరూ ఈ మొత్తాన్ని క్లెయిం చేయలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2012, ఆ తర్వాత చెల్లింపుజరగాల్సిన ఈ మొత్తాన్ని పాలసీదారులు లేదా చట్టబద్ద వారసులు క్లెయిం చేయలేదు. ఇలా క్లెయింకాని మొత్తం 10 సంవత్సరాలకు మించిఉంటే దానిని ప్రతీ సంవత్సరం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కు బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే అలా బదిలీ చేసిన తర్వాత సైతం పాలసీదారులు/వారసులు25 సంవత్సరాల వరకూ క్లెయిం చేసుకునే వెసులుబాటు ఉన్నది.