కాళేశ్వరం, డిసెంబర్ 13: రైతులు, ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను పెద్దపులి కిలోమీటర్ దూరం తరిమిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం రేపింది. మహదేవపూర్కు చెందిన పలువురు కూలీలు అన్నారానికి, కొందరు మంచిర్యాల జిల్లాలో జరిగే పెండ్లికి టాటా ఏస్ వాహనంలో సోమవారం తెల్లవారుజామున బయల్దేరారు. అన్నా రం గ్రావిటీ కెనాల్ వద్ద వీరి వాహనాన్ని పెద్దపులి వెంబడించిందని, కిలోమీటరు దూరం తరిమిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అనంతరం కుంట్లం గ్రామం వద్ద ఆగినట్టు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత కుంట్లం గ్రామస్థులు పొలం పనులకు వెళ్తుండగా రోడ్డుపై కూర్చున్న పులిని చూసి భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు పులి జాడ కోసం సమీప అటవీప్రాంతాల్లో గాలించారు. గోదావరి తీరంలోని ఇసుకలో పులి పాదముద్రల ద్వారా అది నది దాటి మంచిర్యాల జిల్లాలోకి వెళ్లినట్టు గుర్తించారు. ఈ మేరకు ఆ జిల్లా అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశారు.