వనపర్తి : గిరిజనుల ఎన్నో ఏండ్ల కల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తిలో సంత్ సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి వేడుకలకు హాజరై మాట్లాడారు.
సీఎం కేసీఆర్ నిర్ణయంతో తండాలను గిరిజనులే అభివృద్ధి చేసుకుంటున్నారని తెలిపారు. తండాలు ఎలా పురోగమిస్తున్నాయో కండ్ల ముందు కనిపిస్తుందన్నారు. గిరిజన విద్యార్థులు ప్రభుత్వ సహకారంతో ఉన్నత చదువులు చదువుతున్నారని మంత్రి పేర్కొన్నారు. సంత్ సేవాలాల్ మార్గం అనుసరణీయమని, బంజారాలకు ఆయన అందించిన సేవలు మరవలేనివన్నారు.
వనపర్తి జిల్లాలో ఎంబీబీఎస్, ఐఐటీల్లో సీట్లు సాధించిన గిరిజన విద్యార్థులకు సన్మానం చేశారు. వనపర్తి గిరిజన భవన్ కు అర ఎకరా స్థలం కేటాయించారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తదితరులు తదితరులు పాల్గొన్నారు.