వికారాబాద్, ఆగస్టు 29 : ఇంటి కరెంట్ బిల్లు విషయంలో తండ్రి, కొడుకుల గొడవలో తండ్రి మృతి చెందిన విషాదకర సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్ సీఐ టంగుటూరి శ్రీను తెలిపిన వివరాల ప్రకారం..వికారాబాద్ మండలం అత్తెల్లి గ్రామానికి చెందిన ఎక్మామిడి రామచంద్రయ్య(58), కొడుకు యాదయ్య ఇంటి కరెంట్ బిల్లు విషయంలో సోమవారం రాత్రి గొడవ పడ్డారు. ఆవేశానికి గురైన యాదయ్య ఇనుప రాడ్డుతో తండ్రి రామచంద్రయ్య తలపై బలంగా కొట్టాడు.
దీంతో తీవ్రంగా గాయపడిన రామచంద్రయ్యను గ్రామస్తులు చికిత్స నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు రామచంద్రయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని తమ్ముడి కొడుకు లాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.