హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ సర్కారు అవలంబిస్తున్న ఆర్థిక విధానాలతో నిత్యావసరాలు మొదలు పెట్రోల్ రేట్ల దాకా అన్నీ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రభావం ఎక్కువగా మధ్యతరగతి మీదే పడుతున్నది. ఫలితంగా సగటు పౌరుడు రోజురోజుకు పేదరికంలోకి జారుకొంటున్నాడు. కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, తదితర శాఖలు వెల్లడిస్తున్న గణాంకాలే ఉదాహరణే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశ జనాభాలో మధ్య తరగతి జనాభా.. 29 శాతం. జాతీయ ఆదాయంలో వారిదే 79 శాతం వాటా. దేశీయ వస్తు ఉత్పత్తుల వినియోగదారుల్లో 70 శాతం వారే ఉన్నారు. అంటే.. దేశ ప్రగతిలో వారి పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు.
కేంద్ర అసమర్థ విధానాల ఫలితంగా ఇప్పుడు దేశంలోని మధ్యతరగతి కొనుగోలు శక్తి నానాటికీ దిగజారిపోతున్నది. నలుగురు కుటుంబసభ్యుల సగటు ఖర్చు ఎనిమిదేండ్లలో రెండింతలైంది. నిత్యావసర సరుకులు, రవాణా ఖర్చులు, విద్య, వైద్యం, అద్దె.. ఇలా అన్ని ఖర్చులూ డబుల్ అయ్యాయి. అదే స్థాయిలో ఆదాయం పెరగకపోవటం, సబ్సిడీల్లో కేంద్రం కోతలు విధించటంతో కుటుంబ అవసరాలను కూడా తీర్చుకోలేని దుస్థితికి మధ్యతరగతి ప్రజలు చేరుకొన్నారు. కొనుగోలు శక్తిని కోల్పోతూ క్రమంగా పేదరికంలోకి జారుతున్నారు. కరోనా కూడా తోడవ్వటంతో మధ్యతరగతి బడ్జెట్ తారుమారైంది. దేశంలో ఏడాది కాలంలో ఏకంగా 36 లక్షల మంది పేదరికంలోకి చేరినట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. గతంలో జీతంలో కనీసం 10 శాతం పొదుపు చేసే అవకాశం ఉండగా, ప్రస్తుతం అప్పులతో నెట్టుకు రావాల్సిన దుస్థితి తలెత్తింది.
కేంద్ర విధాన వైఫల్యాల వల్లే నిత్యావసర సరుకులు పెరుగుతున్నా యి. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ఉద్దీపన ప్యాకేజీలు లేవు. ఎఫ్సీఐలో 86 మిలియ న్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయి. పప్పులు, నూనెగింజలు మినహా ఇతర పంటలన్నీ దేశీయ అవసరాలకు మించి ఉన్నా యి. అయినా కేంద్రం నిర్వహణ లేమీతో ధరలు పెరిగిపోతున్నాయి. ఇవే విధానాలు కొనసాగితే దేశం శ్రీలంకలా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
– డీ పాపారావు, ఆర్థికవేత్త
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల ట్రాన్స్పోర్టు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఫలితంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. రవాణా ఖర్చలు తగ్గితే ఆటోమెటిక్గా సరుకుల ధరలు తగ్గుతాయి.
– నవీన్,కిరాణ వ్యాపారి, ఎర్రగడ్డ