ముంబై, ఫిబ్రవరి 22: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలు మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఉదయం ఆరంభం నుంచే తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు.. భారీ నష్టాలకు గురైయ్యాయి. మదుపరులు అమ్మకాల ఒత్తిడిలోకి జారుకోవడంతో ఒక దశలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ సుమారు 1,300 పాయింట్లు పడిపోయింది. అయితే తిరిగి కొనుగోళ్ల మద్దతు లభించడంతో చివరకు 382.91 పాయింట్ల నష్టంతో 57,300.68 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 114.45 పాయింట్లు దిగజారి 17,092.20 వద్ద నిలిచింది. దీంతో వరుసగా ఐదోరోజూ స్టాక్ మార్కెట్లు నష్టాలకే పరిమితమైనైట్టెంది. కాగా, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఇక సెన్సెక్స్లో టాటా స్టీల్ షేర్ విలువ అత్యధికంగా 3.64 శాతం క్షీణించింది. ఆ తర్వాత టీసీఎస్ 3.59 శాతం, ఎస్బీఐ 2.67 శాతం మేర పడిపోయాయి. డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హెచ్యూఎల్, అల్ట్రాటెక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్ వంటి షేర్లూ నిరాశపరిచాయి. మొత్తం సెన్సెక్స్లోని 30 షేర్లలో 20 నష్టాల్లోనే ముగిశాయి.
దెబ్బకొట్టిన ముడి చమురు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పరుగులు పెట్టడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. బ్యారెల్ ధర 97.35 డాలర్లకు చేరడం మదుపరులను లాభాల స్వీకరణ వైపు నడిపించింది. 2014 సెప్టెంబర్ తర్వాత ఇదే గరిష్ఠం కావడం గమనార్హం. భారతీయ ఇంధన అవసరాల్లో మెజారిటీ భాగం దిగుమతులతోనే తీరుతుండటం, ఆయా రాష్ర్టాల్లో ఎన్నికల అనంతరం మళ్లీ పెట్రో ధరలు పెరగడం ఖాయమన్న సంకేతాలుండటం కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయని ట్రేడింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయంగా ఇంధన ధరలు పెరిగితే ఇప్పటికే భగ్గుమంటున్న ద్రవ్యోల్బణం మరింత ఎగిసిపడుతుందని, ఇది కీలక వడ్డీరేట్లను పెంచేలా రిజర్వ్ బ్యాంక్ను ఉసిగొల్పుతుందన్న అంచనాలతోనే బ్యాంకింగ్ షేర్లు డీలాపడ్డాయని చెప్తున్నారు.
గ్లోబల్ మార్కెట్లు మటాష్
ప్రపంచ మార్కెట్లనూ రష్యా-ఉక్రెయిన్ యుద్ధ మేఘాలు ఆవరించాయి. ఈ క్రమంలోనే ఆసియా దేశాల్లో ప్రధాన మార్కైట్లెన జపాన్ 1.7 శాతం, హాంకాంగ్ 2.7 శాతం, దక్షిణ కొరియా 1.4 శాతం, చైనా 1 శాతం చొప్పున నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లదీ ఇదే పరిస్థితి. జర్మనీ 0.9 శాతం, ఫ్రాన్స్ 0.6 శాతం, బ్రిటన్ 0.4 శాతం మేర నష్టాల్లో కదలాడుతున్నాయి. అమెరికా, రష్యా సూచీలూ పతనం దిశగానే వెళ్తున్నాయి.
రూపాయి ఢమాల్
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం ట్రేడింగ్లో 29 పైసలు క్షీణించింది. 74.84 వద్ద నిలిచింది. ఉదయం 74.71 వద్ద రూపాయి ట్రేడింగ్ మొదలవగా.. ఒక దశలో కరెన్సీ విలువ 74.99కి దిగజారింది. తిరిగి కోలుకుని 74.84 వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు ఏడేండ్ల గరిష్ఠానికి ఎగబాకడం కూడా దేశీయ కరెన్సీని నష్టపరిచాయని ఫారెక్స్ ట్రేడర్లు చెప్తున్నారు. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపరులు సోమవారం రూ.2,261.90 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ పరిణామం కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నది.