న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: తమ సమస్యలను కంపెనీ పట్టించుకోవడం లేదని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ నెల 4న లండన్లోని గూగుల్ కార్యాలయ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. అంతకుముందు జ్యూరిచ్లోని గూగుల్ సిబ్బంది కూడా ఉద్యోగాల తొలగింపు నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించారు. గూగుల్ లే ఆఫ్ కారణంగా 15 ఏండ్ల కంటే ఎక్కువ సర్వీస్ కలిగిన ఉద్యోగులకు కూడా ఉద్యోగాలు కోల్పోతున్నారు. గూగుల్ సహా ఇతర టెక్ కంపెనీలు సరైన హెచ్చరికలు జారీ చేయకుండానే ఉద్యోగులను తొలగిస్తున్నాయని లింక్డ్ఇన్లోని కొన్ని పోస్టులు తెలియజేస్తున్నాయి. అయితే ఆర్థిక కారణాల వల్ల ఉద్యోగుల తొలగింపు అనివార్యమైందని గూగుల్ చెప్తున్నది.
అమెరికన్ టెక్ దిగ్గజ కంపెనీలు యూరప్కు వచ్చే సరికి లే ఆఫ్లో స్పీడ్ తగ్గిస్తున్నాయి. ఇక్కడి చట్టాల ప్రకారం ఉద్యోగులను తొలగించే ముందు అక్కడి కార్మిక సంఘాలతో కంపెనీ యాజమాన్యాలు చర్చలు జరపాల్సి ఉంటుంది. ప్రభుత్వ కార్మిక చట్టాల ప్రకారం.. తొలగించినవారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెజాన్, గూగుల్, మెటా లాంటి కంపెనీలు ట్రేడ్ యూనియన్లతో చర్చలు జరుపుతున్నాయి. ఉద్యోగులకు ఏడాది వేతనంతో కూడిన స్వచ్ఛంద ఉద్యోగ విరమణను ప్రతిపాదిస్తున్నాయి.
ఆన్లైన్లో నిత్యావసరాలను త్వరగా చేరవేసే సంస్థ డంజో తాజాగా 300 మంది ఉద్యోగులను తొలగించింది. నష్టాల్లో ఉన్న ఆ సంస్థ ఇటీవలే రూ.62 కోట్లు సేకరించింది. అయినా, వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.