న్యూఢిల్లీ, మార్చి 19: ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే కొనేయండి. లేకపోతే ఈ నెల చివరి నుంచి వీటి ధరలు పెరగనుండటంతో మీ జేబుకు మరిన్ని చిల్లులు పడే అవకాశాలున్నాయి. ఈవీల వినిమయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీం-2024లో మార్పులు చేయడంతో ఈ స్కీం కింద సబ్సిడీలు తగ్గిపోనుండటంతో వాహన ధరలు పెంచడానికి సంస్థలు సిద్ధమవుతున్నాయి.
వచ్చే నెల 1 నుంచి ద్విచక్ర వాహన విక్రయ సంస్థలు తమ వాహన ధరలను 10 శాతం వరకు పెంచనున్నాయని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఇప్పుడిప్పుడే వీటికి ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ధరలు పెంచడం వల్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది.
గతంలో ప్రకటించి ఫేమ్-2 స్కీం గడువు ఈ నెల చివరినాటికి ముగియనుండటం ఇందుకు కారణమని తెలిపింది. ఈ స్కీం కింద ద్విచక్ర వాహనాలపై రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు సబ్సిడీ లభిస్తుండేది. ఈ స్కీం గడువు ముగియనుండటంతో వాహన విక్రయ సంస్థలు ఈ భారాన్ని కొనుగోలుదారుడిపై వేయనుండటంతో వీటి ధరలు పెరిగే అవకాశం ఉన్నదని ఇక్రా ప్రతినిధి ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది చివరినాటికి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినిమయాన్ని 6-8 శాతానికి చేరుకోనున్నది.