ఆటంకాలు అధిగమిస్తాం
మిగులు విద్యుత్తు సాధిస్తాం
కరెంటు చౌర్యాన్ని అరికట్టేందుకు ఎమ్మెల్యేలు సహకరించాలి
పద్దులపై చర్చలో మంత్రి జగదీశ్రెడ్డి
హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, ఆటంకాలు సృష్టిస్తున్నా తెలంగాణను మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తూ, ఫైనాన్స్ సంస్థల నుంచి నిధులు రాకుండా మోకాలడ్డుతున్నా.. తాము వెనక్కి తగ్గడం లేదని స్పష్టంచేశారు. కోతలు లేకుండా అన్ని రంగాలకూ నిరంతరం నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సోమవారం శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో విద్యుత్తు విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రూ.34 వేల కోట్లకుపైగా ఖర్చుచేసి కొత్తలైన్లు, కొత్త సబ్స్టేషన్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
విద్యుత్తు చౌర్యం అరికట్టాలి
విద్యుత్తు చౌర్యాన్ని అరికట్టేందుకు ఎమ్మెల్యేలు సహకరించాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి జగదీశ్రెడ్డి విజ్ఞప్తిచేశారు. విద్యుత్తు చౌర్యాన్ని అరికట్టకపోతే సంస్థ సజావుగా నడవడం కష్టమని హెచ్చరించారు. టారిఫ్ పెంపు విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఉండదని చెప్పారు. డిస్కంలు నష్టాల్లో ఉన్నాయనడంలో వాస్తవం లేదని, తెలంగాణ విద్యుత్తు సంస్థలకు దేశంలో క్లీన్ ఇమేజ్ ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ రంగాలకు రూ. 25,000 కోట్లకుపైగా రాయితీలు కల్పించినట్టు వివరించారు. రంజాన్, తదితర పండుగల సందర్భంలో అసౌకర్యం తలెత్తకుండా చూసేందుకు మెయింటెనెన్స్ పనులు తగ్గిస్తామని, తప్పనిసరి పరిస్థితిలో సరఫరాను నిలపాల్సి వస్తే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. శాస్త్రీయ అధ్యయనం తరువాత చార్మినార్, ఫలక్నుమా జోన్లను విడదీసే అంశంపై నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.
రాష్ట్రంలో తలసరి విద్యుత్తు వినియోగం 2,012 యూనిట్లు
రాష్ట్రంలో 2020-21లో తలసరి విద్యుత్తు వినియోగం 2,012 యూనిట్లుగా ఉన్నదని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. ఇది జాతీయ స్థాయి కంటే 70% అధికమని వివరించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 17,503 మెగావాట్లకు పెరిగిందని వివరించారు. సోలార్ విద్యుత్తు ఉత్పత్తి 74 మెగావాట్ల నుంచి 4,430 మెగావాట్లకు పెరిగిందని పేర్కొన్నారు.