నాందేడ్ : మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పనులను అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , ఎంపీ బీవీ పాటిల్, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బోధన్ ఎమ్మెల్యే షకీల్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.
సభాస్థలితోపాటు పార్కింగ్ ప్రదేశాలు, బారికేడ్లు, ఇతర పనుల ప్రగతిని పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ తో పాటు జాతీయ స్థాయి నేతలు వస్తున్నందున ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సభా ప్రాంగణానికి చేరుకునే మార్గాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేక మంది బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.
ఫిబ్రవరి 5న నిర్వహించనున్న సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు బీఆర్ఎస్లో చేరనున్నారని వెల్లడించారు.
అదేవిధంగా మహారాష్ట్ర ప్రజలు కూడా తెలంగాణ మోడల్ తరహా పాలన కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. భావసారుప్యత కలిగిన వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ తో కలిసి పని చేసేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.
గురుద్వార్ను దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు
నాందేడ్లోని సిక్కుల పవిత్ర స్థలం గురుద్వార్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బీవీ పాటిల్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వారికి గురుద్వార్ ప్రబంధక కమిటీ ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.