వెంగళరావునగర్, డిసెంబర్ 12: ఇంట్లో దొంగలు పడితే బంగారం, డబ్బుతోనే పారిపోతారు. కానీ, ఏకంగా ఇల్లునే ఊడ్చేశారు కొందరు ఘరానా మోసగాళ్లు. సామాను తరలింపు కోసం ట్రాన్స్పోర్ట్ను బుక్ చేస్తే ఇంట్లోని సామానంతా వ్యానులో ఎక్కించి మూటముల్లె సర్దుకొని ఉడాయించారు. దీంతో కుటుంబమంతా కట్టుబట్టలతో మిగలాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్లోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. మోతీనగర్లోని అవంతినగర్ ఈస్ట్లో నివాసముండే కిరణ్.. హైదరాబాద్లో ఎల్ఐసీ బ్రాంచ్ హెడ్గా పని చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ బదిలీ కావటంతో ఇంట్లో సామాను తరలింపు కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశారు. ఈ నెల 5న ఉర్మి లాజిస్టిక్స్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ను బుక్ చేసుకొన్నారు. మరుసటి రోజు ముగ్గురు వ్యక్తులు ఇంటికొచ్చి సామానంతా చూసి రూ. 12,980 ఖర్చు అవుతుందని చెప్పి రూ.వెయ్యి అడ్వాన్స్గా తీసుకొన్నారు. 6వ తేదీ మధ్యాహ్నం ఇంట్లోని సామానంతా బాక్సుల్లో సర్ది, టీవి, ఫ్రిజ్, బెడ్లు, వంటసామగ్రి, పల్సర్ బైక్ను వ్యాన్లో ఎక్కించారు. భార్య, కూతురితో కలిసి కిరణ్ వైజాగ్కు బస్సులో వెళ్లారు. బస్సులో వెళ్తుండగానే.. ట్రాన్స్పోర్ట్కు రూ.27 వేలు చెల్లించాలని కిరణ్కు మెసేజ్ వచ్చింది. కంగారుతో వ్యాన్లోని వ్యక్తికి ఫోన్ చేయగా, ఆ పాత కొటేషన్ తమకు గిట్టుబాటు కాదని, రూ.27 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మీ సామానును మీరు దింపుకోవాలంటే అడిగిన డబ్బు ఇవ్వాలని, లేకుంటే సామాను గోడౌన్కు వెళ్తుందని, అక్కడ వారం పాటే ఉంటుందని, గోడౌన్ చార్జీల కింద రోజుకు రూ.3 వేలు అదనంగా చెల్లించాలని మోసగాళ్లు చెప్పటంతో కిరణ్ ఖంగుతిన్నారు. గూగుల్ పే, ఫోన్ పేలో డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, నగదు ఇస్తానని చెప్తే నగర శివారులోని ఓ ప్రాంత గూగుల్ లొకేషన్ షేర్ చేసి రమ్మనటంతో భయంతో వెళ్లలేదని బాధితుడు తెలిపారు. తనకు కాల్ చేసిన ఫోన్ నంబర్కు ఫోన్ చేస్తే హర్యానా అని కనిపిస్తున్నదని, హిందీలో మాట్లాడుతున్నారని, సామాను గురించి మాత్రం చెప్పటం లేదని వాపోయారు. చేసేదేమీలేక శనివారం సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భార్య, కూతురిని వైజాగ్లో ఉంచి, ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ వచ్చానని చెప్పారు. వ్యాన్లో దాదాపు రూ.4 లక్షల విలువైన సామాను ఉన్నదని, ఐదు రోజులు గడిచినా ఆ మోసగాళ్ల ఆచూకీ లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు.