న్యూఢిల్లీ, మే 13: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లను రూ. 949 చొప్పున ఆఫర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెగా ఐపీవోను రూ.904-949 ధరల శ్రేణితో జారీచేయగా, ఇందులో అప్పర్ పరిమితినే ఇష్యూ ధరగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ షేర్లు పాలసీదారులకు రూ.60 డిస్కౌంట్ పోను రూ. 889 వద్ద, రిటైల్ ఇన్వెస్టర్లు, ఎల్ఐసీ ఉద్యోగులకు రూ.45 డిస్కౌంట్ తర్వాత రూ.904 చొప్పున లభిస్తాయి.
3 రెట్లు ఓవర్ సబ్స్ర్కైబ్ అయిన ఈ ఇష్యూ మే 9న ముగియగా, 12నే బిడ్డర్లకు షేర్లను కేటాయించారు. పాలసీదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు వారివారి డిస్కౌంట్లను వర్తింపచేసి షేర్లను కేటాయించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రూ. 949 ధరతో 22.13 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించడంతో ప్రభుత్వానికి రూ. 20,557 కోట్ల నిధులు సమకూరాయి. మే 17న ఎల్ఐసీ షేర్లు స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టవుతాయి.