హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)పై అధ్యయనానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) మార్గదర్శకాలను రూపొందించింది. ఆనకట్టపై తెలంగాణ, ఏపీ లేవనెత్తిన వివిధ అంశాలపై అధ్యయనం జరిపేందుకు కేఆర్ఎంబీ ఇటీవల పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆర్డీఎస్ నుంచి ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు నీరు రావడం లేదని, ప్రాజెక్టు ఎత్తును పెంచాలని, కాలువల ఆధునీకరణ చేపట్టాలని తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు కేఆర్ఎంబీకి స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆర్డీఎస్కు సంబంధించి అధ్యయనం చేయాల్సిన అంశాలపై మార్గదర్శకాలను రూపొందించి, సీడబ్ల్యూపీఆర్ఎస్కు నివేదించింది. ఆయా అంశాలపై గణాంకాల ఆధారంగా, లేదంటే క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అధ్యయనం జరిపి 6 నెలల్లోగా నివేదిక అందించాలని కోరింది.
ఈ మార్గదర్శకాలపై తెలంగాణ ఇంజినీర్లు మండిపడుతున్నారు. కేఆర్ఎంబీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై కర్ణాటక ఇంజినీరింగ్ రిసెర్చ్ స్టేషన్, నిపుణుల కమిటీ గతంలోనే అధ్యయనం జరిపి నివేదికలు అందజేశాయని గుర్తు చేస్తున్నారు. ఆ నివేదికల్లోని సూచనలను పాటించేందుకు చర్యలు చేపట్టకపోగా ఇప్పుడు అవే అంశాలపై అధ్యయనం జరిపించేందుకు కేఆర్ఎంబీ మొగ్గుచూపడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. దీని వల్ల మరింత కాలయాపనే తప్ప ఒరిగేదేమీ ఉండదని పెదవి విరుస్తున్నారు. ఆర్డీఎస్ కాలువను హెడ్వర్క్స్ వద్ద 850 క్యూసెక్కులతో, తెలంగాణ సరిహద్దుకు వచ్చేసరికి 770 క్యూసెక్కుల సామర్థ్యంతో డిజైన్ చేయడంపై మండిపడుతున్నారు. కాలువ మొత్తాన్ని ఒకే సామర్థ్యంతో విస్తరిస్తేనే తెలంగాణకు 15.9 టీఎంసీలు, కర్ణాటకకు 1.2 టీఎంసీల నీరు అందుతుందని వాదిస్తున్నారు. తెలంగాణ సిఫారసులను మార్గదర్శకాల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.