-దాని ఘనత పూర్తిగా కేసీఆర్దే
-ఆన్లైన్ సెమినార్లో వి. ప్రకాశ్ కితాబు
ఉస్మానియా యూనివర్సిటీ:ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అరుదైన ఘనత సాధించిందని, అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా చరిత్ర సృష్టించిందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి. ప్రకాశ్ కొనియాడారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ప్రశంసించారు. ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో ‘ఇరిగేషనల్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ స్టేట్ : ఎ హిస్టారికల్ పర్స్పెక్టివ్’అనే అంశంపై ప్రత్యేక ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హిస్టరీ విభాగం హెడ్ ప్రొఫెసర్ అర్జున్రావు కుతాడి అధ్యక్షతన నిర్వహించిన ఈ వర్చువల్ కార్యక్రమంలో వి. ప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల రంగ అభివృద్ధి గురించి వివరించారు.
క్రీ.పూ.2030 నుంచి ఇప్పటి వరకు ఎవరెవరి పాలనలో ఏఏ చెరువులు నిర్మాణమయ్యాయో సవివరంగా పేర్కొన్నారు. నానేఘాట్ శాసనం ప్రకారం క్రీ.పూ. 2030 ప్రాంతంలో శాతవాహన చక్రవర్తి ప్రధాన కర్తవ్యాలలో చెరువులు తవ్వడం ఒకటని చెప్పారు. ఆ తరువాత ఇక్షాకుల కాలంలో విజయపురి (నాగార్జునసాగర్), శ్రీశైలం, జగ్గయ్యపేటలలో తటాకాల నిర్మాణం జరిగిందన్నారు. ముదిగొండ చాళుక్యుల వంశానికి చెందిన కుందవ్వ రాణి ఖమ్మం సమీపంలోని ముదిగొండలో కుంద సముద్రం అనే చెరువును తవ్వించిందని, గజ మల్లు (గజకేసరి) బయ్యారం, కొరివిలలో చెరువులను తవ్వించారని వివరించారు.
వేములవాడ చాళుక్యుల వంశానికి చెందిన రెండవ హరికేసరి కేసముద్రం చెరువును తవ్వించారని పేర్కొన్నారు. కాకతీయుల కాలంలో చక్రవర్తి తప్పనిసరిగా పాటించాల్సిన సప్తసంతానాలలో ఆరవ భాగంలో చక్రవర్తి గుళ్లు నిర్మించడంతో పాటు చెరువులను తవ్వించాలని స్పష్టంగా నిర్దేశించారని, వారి పాలనా కాలంలోనే ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో చెరువులు నిర్మితమయ్యాయన్నారు. లక్కవరం, పాకాల, రామప్ప, బయ్యారం, గణపవరం (ఘనాపూర్), వైరాలలో ఉన్న చెరువులు అప్పుడు తవ్వించినవేనని గుర్తు చేశారు.
కుతుబ్షాహీలు తమ పరిపాలనలో దాదాపు పదిహేడు చెరువులు, మూడు కాలువలు, మూడు డ్యాంలు, మూడు బావులు తవ్వించారన్నారు. వారి పాలనా కాలంలోనే దశబంధు ఇనాం విధానం ద్వారా చెరువుల తవ్వకాలు, మరమ్మత్తులు, పూడికతీత పనులను చేపట్టేవారని వివరించారు. అసఫ్జాహీ పరిపాలనా కాలంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య పర్యవేక్షణలో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లను తవ్వించారని చెప్పారు.
స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ హయాంలో తొలిగా నాగార్జున్సాగర్ ప్రాజెక్టు నిర్మించారన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీకే చెందిన వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా తెలంగాణలో 36 ప్రాజెక్టులను డిజైన్ చేయగా వాటిలో ఒక్కటీ పూర్తి చేయలేదని, ఇది ముమ్మాటికీ ఈ ప్రాంతానికి జరిగిన విద్రోహమేనని అభిప్రాయపడ్డారు. టీడీపీ హయాంలో నీటిపారుదల రంగానికి అసలు ప్రాముఖ్యతే లేకుండా చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మించి, మద్రాసుకు తాగునీరు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ హయాంలో సాగునీటి రంగానికి అమితమైన ప్రాముఖ్యత కల్పించారని ప్రశంసించారు.
మిషన్ కాకతీయ పేరుతో చెరువులను మూడు రకాలుగా (సూక్ష్మ, మధ్యస్థ, భారీ) విభజించి, అందుకనుగుణంగా నిధులు కేటాయించి, వాటికి మరమ్మత్తులు చేశారన్నారు. దీని ఫలితంగా తెలంగాణలో 2.5 మీటర్ల మేరకు భూగర్భ జల మట్టం పెరిగిందన్నారు. 1956లో ఒక కోటి పదిహేను లక్షల ఎకరాలు సాగులో ఉంటే నేడు ఈ చెరువులు, ప్రాజెక్టుల ద్వారా ఒక కోటి 35 లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయని, సుమారు 20 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయని వివరించారు.
రామప్ప దేవాలయానికి వారసత్వ కట్టడం గుర్తింపును యునెస్కో ఇచ్చిందని గుర్తు చేశారు. అదే విధంగా రామప్ప చెరువు, పెద్ద చెరువులకు సైతం ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడం గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వీటికి త్వరలోనే ఆ గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి. గణేశ్ స్వాగతోపన్యాసం చేశారు.