హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూపు అక్రమాలకు సంబంధించి హిండెన్బర్గ్ నివేదికపై సమగ్ర విచారణ జరిపేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేయాలని లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రెండోరోజు శుక్రవారం కూడా బీఆర్ఎస్ ఎంపీలు ఉభయసభలను స్తంభింప చేశారు. అదానీ గ్రూపుపై చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీలు ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అయితే ప్రభుత్వం చర్చకు అనుమతించకపోవడంతో ఉభయ సభల్లోనూ బీఆర్ఎస్, ఆప్ సహా పలు పార్టీల సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. దీంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభలను సోమవారానికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు మాట్లాడుతూ.. అతి తకువ కాలంలో అదానీ అత్యంత ధనవంతుడు కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని, ఈ శతాబ్దంలో ఇంతకన్నా పెద్ద సామ్ లేదని అన్నారు. అదానీ కంపెనీల్లో అవకతవకలు జరిగాయని హిండెన్ బర్గ్ నివేదికలో పేరొన్నారని, దానిపై ప్రభుత్వం చర్చకు అనుమతించడంలేదని చెప్పారు. రెగ్యులేటరీ వ్యవస్థలు కూడా ఏమీచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగా ఉన్న అదానీ వ్యవస్థగా మారాడని, రోడ్లు, బొగ్గు, విద్యుత్తు, ఎయిర్పోర్టులు, పోర్టులు, మైనింగ్, చివరికి మీడియా రంగం…ఇలా ఎకడ చూసినా అదానీ కంపెనీలు ఉన్నాయని కేకే చెప్పారు. బీజేపీ వచ్చిన తర్వాత క్రోని క్యాపిటలిజం పెరిగిపోయిందన్నారు. ఈ అక్రమాలపై చర్చించేందుకు సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. విపక్ష పార్టీలన్నీ తమతో కలిసి వస్తున్నాయని చెప్పారు. ఈడీ, సీబీఐ, ఐటి కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీకి రాజకీయ సాధనాలుగా పనిచేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేయడం, ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేయడం మాత్రమే వాటి పని అని చెప్పారు.
కేంద్రం స్పందించకపోవడం దారుణం : బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు
అదానీ వ్యవహరంపై కేంద్రం వెంటనే స్పందించి, పార్లమెంట్లో చర్చ జరిపి, దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు డిమాండ్చేశారు. విపక్షాలతో కలసి ఉభయ సభల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసినా కేంద్రం స్పందించడం లేదని అన్నారు. ఈ అంశంపై లోక్సభ, రాజ్యసభల్లో మళ్లీ మళ్లీ నోటీసులు ఇస్తామని చెప్పారు. తెలంగాణ కోసం ఏ విధంగానైతే పోరాడామో అదే విధంగా ఈ అంశంపై కూడా ఉద్యమిస్తామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమ కష్టార్జితాన్ని ఎల్ఐసీ, బ్యాంకుల్లో దాచుకున్న కోట్ల మంది ప్రజలు, పేదలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. దేశ ప్రతిష్టను దిగజార్చి, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన అదానీ నిర్వాకంపై సమగ్ర దర్యాప్తు జరిపించి, ప్రజలకు న్యాయం చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని నామా స్పష్టం చేశారు. కేంద్రానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ అంశంపై సత్వరమే పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ముందుగా స్పందించాల్సిన కేంద్రమే వెనకిపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం అదానీకి సహకరిస్తున్నది కాబట్టే అదానీ అంశంపై చర్చకు ముందుకురావడం లేదని స్పష్టం చేశారు.
అవకతవకలపై చర్చించాల్సిందే
అదానీ గ్రూపుల్లో అవతకవతకల వ్యవహారం శుక్రవారం కూడా పార్లమెంటును స్తంభింపజేసింది. అదానీ గ్రూపుల్లో అవకతవకలు జరిగినట్టు హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక, అదానీ స్టాక్ల పతనంపై చర్చించాల్సిందేనని ఉభయ సభల్లో విపక్ష పార్టీల ఎంపీలు పట్టుబట్టారు. అదానీ గ్రూపుల్లో ఎల్ఐసీ, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు పెట్టిన పట్టుబడి దేశంలోని కోట్లాది మంది ప్రజల కష్టార్జితమని, ఆ సొమ్మంతా ఇప్పుడు ప్రమాదంలో పడిందని రాజ్యసభలో విపక్ష సభ్యులు నినదించారు. దీంతో సభను మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. మధ్యాహ్నం తర్వాత సభ ప్రారంభమైనా విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.
లోక్సభలోనూ..
లోక్సభను సైతం అదానీ అంశం కుదిపేసింది. అదానీ గ్రూపుల్లో అవతకవతలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ద్వారా విచారణ జరిపించాలని విపక్ష పార్టీల సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. వాయిదా అనంతరం సభను ప్రారంభించగా విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగింది. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది.
ఏకతాటిపైకి 16 విపక్షాలు
దేశ ప్రజల కష్టార్జితాన్ని ప్రమాదంలో పడేసిన అదానీ గ్రూపుల వ్యవహారంపై విచారణకు డిమాండ్ చేస్తూ 16 విపక్ష పార్టీలు ఏకతాటి మీదకు వచ్చాయి. ఇందుకు గానూ ఉభయసభల్లో కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించాయి.