హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): యాసంగిలో ఇతర పంటల సాగు గణనీయంగా పెరిగింది. ప్రత్యేకించి నూనె, పప్పుగింజల సాగు గత యాసంగి కంటే 2.09 లక్షల ఎకరాలకుపైగా పెరగటం గమనార్హం. ప్రస్తుత యాసంగిలో ధాన్యం (ఉప్పుడు బియ్యం) కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించిన విషయం తెలిసిందే. ఈ సూచన మేరకు చాలా మంది రైతులు వరి సాగును తగ్గించి ఇతర పంటలవైపు మళ్లారు. మరికొందరు రైతులు తమ భూములను బీళ్లుగా ఉంచారు. ప్రస్తుత యాసంగి సీజన్ దాదాపుగా ముగిసిందని, ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 54 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ ప్రకటించింది. గత యాసంగిలో 4.58 లక్షల ఎకరాలుగా ఉన్న పప్పుగింజల సాగు.. ఈ సీజన్లో 5.35 లక్షల ఎకరాలకు (77 వేల ఎకరాలు) పెరిగినట్టు వెల్లడించింది. అదేవిధంగా నూనె గింజల సాగు 3.70 లక్షల ఎకరాల నుంచి 5.02 లక్షల ఎకరాలకు (1.32 లక్షల ఎకరాలు) పెరిగినట్టు తెలిపింది. నూనె గింజల్లో అత్యధికంగా వేరుశనగ సాగు విస్తీర్ణం 75 వేల ఎకరాలు, సన్ఫ్లవర్ విస్తీర్ణం 24 వేల ఎకరాలు.. పప్పు గింజల్లో మినుముల సాగు విస్తీర్ణం 45 వేల ఎకరాలు, శనగ విస్తీర్ణం 24 వేల ఎకరాలు పెరిగినట్టు వివరించింది.
ప్రస్తుత యాసంగిలో వరి సాగు భారీగా తగ్గింది. గత యాసంగిలో 52.78 లక్షల ఎకరాలుగా ఉన్న వరి సాగు విస్తీర్ణం.. ఈసారి 17 లక్షల ఎకరాలు తగ్గి 35.84 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఇది రాష్ట్రంలోని మొత్తం పంటల సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపిందని, ఫలితంగా ఈసారి పంటల సాగు విస్తీర్ణం గత యాసంగి సీజన్ కంటే 14 లక్షల ఎకరాలకుపైగా తగ్గిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది.
గత యాసంగితో పోల్చితే ఈసారి చిరు ధాన్యాల సాగు కూడా 2,300 ఎకరాలకు (1,491 ఎకరాల నుంచి 3,728 ఎకరాలకు) పెరిగింది. ఇందులో రాగులు 2,626 ఎకరాలు, ఇతర మిల్లెట్స్ 1,100 ఎకరాల్లో సాగయ్యాయి.