ఆర్కేపురం : అనాధల బంగారు భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం సరూర్నగర్లోని వీఎం హోమ్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల సమస్యలను తెలుసుకునేందుకు సబ్కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. భవిష్యతులో వారికి కావాల్సిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి పూర్తయిన తరువాత తాము ఎక్కడికి వెళ్లాలో తెలియక భవిష్యత్ అంధకారంగా మారుతుందని, బాలికల వివాహాం అయ్యేంతవరకు ప్రభుత్వం అండగా ఉండాలని చిన్నారులు మంత్రులను కోరారు.
ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ అమ్మ నాన్నలు లేరని చింతించాల్సిన పనిలేదని రాష్ట్ర ప్రభుత్వమే అండగా ఉంటుందని తెలిపారు. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన వీఎం హోమ్ వేలాది మంది అనాధలకు ఆశ్రయం కల్పించిందని, వారికి కుటుంబం ఏర్పడే వరకు చేయూతనిచ్చేందుకు సీఎం కేసీఆర్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.రాష్ట్రంలో 15వేల మంది అనాధలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రత్యేక పాలసి రూపొందించేందుకు చిన్నారుల నుండి సూచనలు, సలహాలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ కొవిడ్ బారిన పడి చాలా మంది చిన్నారులు అనాధలుగా మిగిలారని, వారిని హక్కున చేర్చుకుంటామని తెలిపారు. వారిని అనాధలుగా కాకుండా రాష్ట్ర పిల్లలుగా భావిస్తామని చెప్పారు. వారి బంగారు భవిష్యత్తే ప్రభుత్వ ధ్యేయమన్నారు. సీఎం కేసీఆర్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని సబ్ కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. పిల్లలకు ఉన్న ఇబ్బందులను తెలుసుకున్నామని, కేజీ టూ పీజీతో పాటు పాల్టెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సోషల్ వేల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ పద్మజ రమణ, ప్రిన్సిపల్ సెక్రటరీ దివ్యదేవరాజ్, సరూర్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరికృష్ణయ్య, ప్రిన్సిపల్ సుహాసిని, సూపరిండెంట్ లక్ష్మీపార్వతి, మాజీ కార్పొరేటర్ అనితాదయాకర్రెడ్డి, నియోజకవర్గం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, డివిజన్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్, నియోజకవర్గ యూత్వింగ్ అధ్యక్షులు లోకసాని కొండల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.