ముంబై, నవంబర్ 14: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని అంబజోగాయిలో దారుణం చోటుచేసుకున్నది. 400 మంది వ్యక్తులు ఓ మైనర్ వివాహితపై ఆరు నెలలుగా లైంగికదాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితురాలు రెండునెలల గర్భిణి. విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఆమెను సహాయ కేంద్రానికి తరలించారు. గర్భస్రావం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బాధితురాలి తల్లి రెండేండ్ల క్రితం మరణించింది. దీంతో తండ్రి చిన్నవయసులోనే ఆమెకు పెండ్లి జరిపించాడు. అత్తింట్లో పెట్టే వేధింపులకు తాళలేక బాధితురాలు ఆరు నెలల క్రితం అంబజోగాయి వచ్చింది. అయితే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఇద్దరు వ్యక్తులు ఆమెను లోబర్చుకున్నారు. జరిగిన విషయాన్ని భర్తకు చెబుతానని బాధితురాలిని బెదిరిస్తూ ఆరు నెలల్లో దాదాపు 400 మంది అత్యాచారానికి తెగబడ్డారు. ఈ జాబితాలో ఓ పోలీసు కూడా ఉన్నట్టు బాధితురాలు ఆరోపించారు. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేశారు.