హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ట్రాఫిక్ నానాటికీ పెరుగుతున్నది. 2015లో 9 శాతంగా ఉన్న రద్దీ.. ఈ ఏడాది ఏకంగా 26 శాతానికి చేరింది. దీంతో ఏడేండ్లలో 17 శాతం పెరిగిందని జీఎమ్మార్ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణ, చుట్టుపక్కల రాష్ర్టాల నుంచి ప్రజలు శంషాబాద్ విమానాశ్రయం ద్వారా విదేశీయానానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు జీఎమ్మార్ చెప్పింది. ఈ క్రమంలోనే ఎయిర్పోర్టు వార్షిక ప్రయాణీకుల సామర్థ్యాన్ని 12 మిలియన్ల నుంచి 34 మిలియన్లకు పెంచుతున్నామని ప్రకటించింది. ఇదే సమయంలో ఇంటిగ్రేటెడ్ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టెర్మినల్ను ఒకే గొడుగు కిందకు తెస్తున్నట్టుగా స్పష్టం చేసింది.
భారతీయులు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలకు ఎక్కువగా వెళ్తున్నారు. మాల్దీవులు, ఇండోనేషియా, జపాన్, కొరియా, న్యూజిలాండ్ లాంటి నూతన గమ్యస్థానాలకూ ప్రయాణీకులు పెరిగినట్టు జీఎమ్మార్ వర్గాలు తెలియజేశాయి. కొత్తగా చికాగో, మాల్దీవులకూ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. వీటికి ప్రయాణీకుల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని, లండన్కూ విమాన సర్వీసును జోడించగా రద్దీ భారీగానే ఉందన్నారు. ఈ క్రమంలో దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో గతంలో ఆరో స్థానంలో ఉన్న హైదరాబాద్.. ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపారు.
కరోనాకు ముందు 55 దేశీయ గమ్యస్థానాలు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 70కి పెరిగిందని జీఎమ్మార్ ఈ సందర్భంగా తెలిపింది. సమీప నగరాల నుంచి వచ్చే ప్రయాణీకులకు అతిపెద్ద రవాణా కేంద్రంగా మారిన ఈ విమానాశ్రయం నుంచి.. కేవలం రెండు గంటల్లో దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లే అవకాశం ఉందని జీఎమ్మార్ ప్రతినిధులు తెలిపారు.
తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే. ప్రధాని మోదీ దిగి వచ్చే వరకూ సీఎం కేసీఆర్, రైతులు ఉద్యమించాలి. తెలంగాణ ప్రాంత రైతుల వడ్లు కొనుగోలు చేసేది లేదని కేంద్ర మంత్రి చెప్పడం విడ్డూరం. పంజాబ్ రైతులు రెండు సీజన్లలో పండిస్తున్న పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నప్పుడు తెలంగాణ రైతుల ధాన్యాన్ని ఎందుకు కొనరు? తెలంగాణ ప్రాంత రైతులపై మోదీ వివక్ష చూపొద్దు. సీఎం కేసీఆర్ దేశంలోని రైతులు, నాయకులను ఏకం చేస్తున్నారు. ఈ దెబ్బకు కేంద్రం దిగిరావాలి. అందరూ ఐక్యంగా కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలి.
– పరిపాటి ఇంద్రసేనారెడ్డి, రైతు, పెద్ద కోర్పోలు